వికారాబాద్ : నాణ్యత గల ఆలుగడ్డలు అంటే మోమిన్పేటే గుర్తుకు రావాలి. మంచి ఆలుగడ్డలు పండించి రైతులు లాభాలు అర్జించాలని రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి సంస్థ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా అన్నారు. మంగళవారం మోమిన్పేట మండల కేంద్రంలోని అనంతగిరి రైతు ఉత్పత్తి దారుల కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ పౌసమి బసుతో కలిసి సంస్థ పనితీరును పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..రైతుల ఆర్థిక అభివృద్ధి కోసమే అనంతగిరి రైతు ఉత్పత్తిదారుల సంస్థను ఏర్పాటు చేశాం. ఈ సంస్థ ప్రభ్వుత్వ సంస్థ కాదని, దీనిని రైతులే అభివృద్ధి చేసుకోవాలని సూచించారు. రైతులు పండించిన పంటలకు మంచి లాభాలు చేకూర్చడమే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు.
సంస్థ రిజిస్టర్లను పరిశీలించి పలు సూచనలు చేశారు. ఇక ముందు రైతులు పండించిన కూరగాయల పంటలను వారి పొలాల వద్దనే గ్రేడింగ్ చేసి తీసుకురావాలని తెలిపారు. కూరగాయలను మార్కెట్కు తరలించేందుకు ఈ- వెహికిల్స్ కేటాయించేందుకు కృషి చేస్తామన్నారు. రైతులు పంటలు తీసుకొచ్చి వెంటనే రశీదు పొందాలన్నారు. రైతుల కష్టాన్ని దళారులు సొమ్ము చేసుకోకుండా సంస్థలో రైతు కుటుంబాలు పనిచేస్తే బాగుంటుందన్నారు.
సంస్థ చైర్మన్, వైస్ చైర్మన్లకు అవగాహన కల్పించేందుకు ఢీల్లీలో నిర్వహిస్తున్న ‘సఫల్’ అనే కంపెనీకి తీసుకెళ్లి పనిలో నైపుణ్యం కల్పించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం సంస్థ నిర్వహణ బాగుందన్నారు. ఈ సంస్థ నుంచి నాణ్యత గల ఆలుగడ్డలను అందించి ఆలుగడ్డ అంటే మోమిన్పేటగా గుర్తుండిపోవాలని సూచించారు.