క్విట్ ఇండియా ఉద్యమం ప్రారంభించేందుకు ముందు భారతదేశానికి స్వాతంత్య్రం ఇవ్వాలని మహాత్మాగాంధీ బ్రిటిష్ ప్రభుత్వాన్ని ఒప్పించేందుకు చాలా ప్రయత్నించారు. అటు బ్రిటిష్వారేమో ముందు యుద్ధంలో సహకరించండి.. తర్వాత స్వాతంత్య్రం ఇస్తాం అన్నారు. ఈ విజ్ఞప్తిపై స్పందిస్తూ మీరు ఏ విలువల కోసం పోరాడుతున్నారో అందుకు ఒక బానిస రాజ్యం సహకరించలేదని గాంధీజీ స్పష్టంచేశారు. మాకు స్వాతంత్య్రం ఇస్తే మీ సైన్యం మా దేశంలో ఉండవచ్చు. మేం అన్నివిధాలా సహకరిస్తాం. కానీ, పోస్ట్ డేటెడ్ చెక్కులు మాత్రం స్వీకరించబోం అని గాంధీజీ స్పష్టం చేశారు. బ్రిటిష్ ప్రభుత్వం నాయకులందరినీ అరెస్ట్ చేసింది. ప్రభుత్వం అందరినీ అరెస్టు చేయవచ్చునని గాంధీజీ ముందే దేశ ప్రజలను హెచ్చరించారు.
నేను అప్పుడు నాగ్పూర్లో చదువుకుంటున్నాను. నాయకులు ఎప్పుడు అరెస్ట్ అవుతారు.. ఆ తర్వాత పరిణామాలు ఎలా ఉంటాయనేది రోజూ చర్చించుకునేవారం. తాము అరెస్టయిన తర్వాత ప్రజలతో సంబంధాలు పెట్టుకోలేమని ప్రతి ఒక్కరూ తామే ఉద్యమ నాయకులుగా భావించుకోవాలని గాంధీజీ ముందే తెలిపారు. అందువల్ల కేంద్రీయ కార్యాచరణ లేకుండానే గ్రామాలు, పట్టణాల్లో ప్రజలు తమకు తామే ఉద్యమించారు. ఇలా కొన్ని నెలలు సాగింది. నాయకులను అరెస్టు చేసినా ఉద్యమం నడిచింది. ఉద్యమాన్ని అణచివేసినా ఎక్కువకాలం దేశాన్ని పాలించలేమని బ్రిటిష్వారికి అర్థమైంది. ఇక స్వాతంత్య్రం ఇవ్వాలనే నిర్ణయానికి బ్రిటిష్ ప్రభుత్వం వచ్చింది.