తిరుపతి, 2021 జూలై 23: అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో రేపు పుష్పయాగం నిర్వహించనున్నారు. ఇందుకోసం రేపు సాయంత్రం 6.30 నుంచి రాత్రి 8.30 గంటల వరకు మేదినిపూజ, సేనాధిపతి ఉత్సవం, అంకురార్పణం నిర్వహిస్తారు.జూలై 25వ తేదీ ఉదయం 10.30 గంటలకు స్వామి, అమ్మవార్ల ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం, మధ్యాహ్నం 2.30 నుంచి 5 గంటల వరకు పుష్పయాగ మహోత్సవం నిర్వహిస్తారు. పుష్పయాగంలో వివిధ రకాల పుష్పాలతో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారికి విశేషంగా అభిషేకం చేస్తారు.
ఈ ఆలయంలో జూన్ 19 నుంచి 27వ తేదీ వరకు వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు జరిగాయి. ఈ ఉత్సవాల్లో గానీ, నిత్యకైంకర్యాల్లో గానీ అర్చక పరిచారకుల వల్ల, అధికార అనధికారుల వల్ల, భక్తుల వల్ల తెలిసీ తెలియక ఏవైనా లోపాలు జరిగి ఉంటే వాటికి ప్రాయశ్చిత్తంగా పుష్పయాగం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందని అర్చకులు తెలిపారు.