తిరుపతి, జూలై : తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో శుక్రవారం కనకాంబర సహిత కోటి మల్లెపుష్ప మహాయాగం శాస్త్రోక్తంగా ప్రారంభమైంది. ఈ యాగం జూలై 24వ తేదీ వరకు ఆన్లైన్ వర్చువల్ విధానంలో జరుగనున్నది. కరోనా కారణంగా ప్రపంచ మానవాళికి తలెత్తిన ఆర్థిక ఇబ్బందులను తొలగించాలని శ్రీ మహాలక్ష్మి అవతారమైన శ్రీ పద్మావతి అమ్మవారిని ప్రార్థిస్తూ తిరుమల తిరుపతి దేవస్థానం ఈ మహాయాగం నిర్వహిస్తోంది.
ఉదయం సుప్రభాతంతో అమ్మవారిని మేల్కొలిపి, మూల వర్లకు అభిషేకం నిర్వహించారు. అనంతరం సహస్రనామార్చన, నిత్యార్చన జరిగింది. ఉదయం 8.30 గంటలకు ఆలయంలోని శ్రీ కృష్ణస్వామి ముఖ మండపంలో అమ్మవారిని వేంచేపు చేశారు. ఇందులో భాగంగా సంకల్పం, కుంభ అవాహన, అగ్ని ప్రతిష్ట, చతుష్టార్చన, కోటి కుంకుమార్చనలో ఒక ఆవర్తి,హోమం, లఘుపూర్ణాహుతి నిర్వహించారు.
టీటీడీ పాంచరాత్ర ఆగమ సలహాదారు శ్రీనివాసాచార్యులు పర్యవేక్షణలో ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం వేళల్లో 400 కిలోల పుష్పాలతో అమ్మవారిని అర్చించనున్నారు. ఇందులో ఒక్కపూటకు 40 కిలోల కనకాంబరాలు, 120 కిలోల మల్లెపూలు, 40 కిలోల ఇతర సాంప్రదాయ పుష్పాలు ఉన్నాయి. ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి వచ్చిన180 మంది ప్రముఖ ఋత్వికులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.