శ్రీవల్లి..వెలుగులు విరజిమ్మే వెండి వెన్నెల జాబిల్లి. అందం, చలాకీతనం కలబోసిన పల్లెటూరి పడతి. పాల వ్యాపారం చేసుకునే ఈ సుగుణాల రాశి జీవితంలోకి పుష్పరాజ్ అనే స్మగ్లింగ్ నేపథ్యం ఉన్న యువకుడు ఎలా ప్రవేశించాడు? అనంతరం వారి జీవన ప్రయాణం ఎలా సాగిందో తెలియాలంటే మా సినిమా చూడాల్సిందే అంటున్నారు ‘పుష్ప’ చిత్ర బృందం. అల్లు అర్జున్, రష్మిక మందన్న జంటగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందిస్తున్న ఈ చిత్రం డిసెంబర్ 17న విడుదలకానుంది. నవీన్ ఏర్నేని, వై.రవిశంకర్ నిర్మాతలు. ఈ సినిమాలో ‘నువ్వు అమ్మి అమ్మి అంటా ఉంటే నీ పెళ్లాన్నైపోయినట్టుందిరా సామి..నా సామి..’ అంటూ సాగే మూడో పాటకు సంబంధించిన ప్రోమోను సోమవారం విడుదల చేశారు. పూర్తి గీతాన్ని ఈ నెల 28న విడుదలచేయబోతున్నారు. ‘ఈ చిత్ర ఫస్ట్లుక్, టీజర్కు అద్భుతమైన స్పందన లభిస్తున్నది. భారీ స్థాయిలో ఈ సినిమాను విడుదల చేయబోతున్నాం’ అని నిర్మాతలు తెలిపారు. ఫహాద్ ఫాజిల్, ధనుంజయ్, సునీల్, రావు రమేష్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: మిరోస్లా క్యూబా బ్రోజెక్, సంగీతం:దేవిశ్రీప్రసాద్, సాహిత్యం: చంద్రబోస్, నిర్మాణ సంస్థలు: మైత్రీ మూవీ మేకర్స్, ముత్తంశెట్టి మీడియా, సీఈఓ: చెర్రీ, దర్శకత్వం: సుకుమార్.