కాళేశ్వరం/కోటపల్లి/వేమనపల్లి/కౌటాల, ఏప్రిల్ 23: పుష్కరాలకు తరలివచ్చిన భక్తులతో ప్రాణహిత పులకించింది. శనివారం రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలతోపాటు ఏపీ, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ నుంచి భక్తులు తరలివచ్చి పుణ్యస్నానాలు ఆచరించారు. మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలంలోని అర్జునగుట్ట, వేమనపల్లి, కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలంలోని తుమ్మిడిహట్టి, జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం పుష్కరఘాట్లు భక్తుల తాకిడితో శోభాయమానంగా మారాయి. కాళేశ్వర ఆలయ అర్చకులు నదీమాతకు హారతులు ఇచ్చారు. మహారాష్ట్ర మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ కాళేశ్వరంలో ప్రత్యేక పూజలు చేశారు. ఆదివారం సాయంత్రం 7:30 గంటలకు పుష్కరాలు ముగియనున్నాయి. వేద పండితుల మంత్రోచ్ఛారణల నడుమ నదీమ తల్లికి హారతి, సారె పెట్టి సాగనంపనున్నారు.