చండీగఢ్: టీకాల దందాపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేయడంతో పంజాబ్ సర్కారు ప్రైవేటు హాస్పిటల్స్ కు టీకాల సరఫరా నిలిపివేసింది. ప్రభుత్వం టీకాలు మళ్లించి కోట్లు దండుకుంటున్నట్టు విపక్ష అకాలీదళ్ ఆరోపించింది. 18-44 సంవత్సరాల వయసువారికి సింగిల్ డోస్ వ్యాక్సిన్ ప్రైవేటు హాస్పిటల్స్ ద్వారా సమకూర్చేందుకు పంజాబ్ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీచేసింది. దీనిపై విపక్ష అకాలీదళ్ మండిపడింది. భారీ లాభాలకు కోవాగ్జిన్ టీకాలను మళ్లించిందని ఆరోపించింది. రూ.400 వచ్చి టీకాను సర్కారు ప్రైవేటు హాస్పిటల్స్కు రూ.1060కి అమ్ముతున్నదని, దానిని హాస్పిటల్స్ రూ.1560కి అమ్ముతున్నాయని అకాలీ నాయకుడు సుఖ్బీర్సింగ్ బాదల్ ట్విట్టర్లో ఆరోపించారు. ప్రజల్లో కూడా టీకాల వ్యవహారంపై ఆగ్రహావేశాలు వ్యక్తం కావడంతో సర్కారు తన ఉత్తర్వులను సాయంత్రానికి ఉపసంహరించుకున్నది. ఈ వ్యవహారాన్ని గమనించిన కేంద్ర సర్కారు మొత్తం టీకాల లెక్క తెలియజేయమని పంజాబ్ లోని అమరిందర్ సర్కారును ఆదేశించింది.