పంజాబ్ ఓటమిపై కాంగ్రెస్ విశ్లేషనలు ప్రారంభించింది. ఎక్కడ తప్పటడుగులు పడ్డాయని మథనం ప్రారంభించింది. పంజాబ్ వ్యవహారాల ఇన్చార్జీ హరీశ్ చౌదరి మాల్వా ఆధ్వర్యంలో అభ్యర్థుల భేటీ జరిగింది. ఈ సమావేశానికి మాజీ సీఎం చెన్నీ, పీసీసీ చీఫ్ సిద్దూ కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం సుఖ్జిందర్ సింగ్తో సహా పలువురు పీసీసీ చీఫ్ సిద్దూపై తీవ్రంగా విరుచుకుపడినట్లు తెలుస్తోంది. సిద్దూ వ్యవహార శైలి వల్లే పార్టీ ఘోరంగా నష్టపోయిందని వారందరూ తీవ్ర అసహనం వ్యక్తం చేసినట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. అటు సిద్దూ, ఇటు చెన్నీ వల్లే ఈ ఎన్నికల్లో ఇలాంటి ఫలితాలు వచ్చాయని, వారి వల్లే పార్టీ మూల్యం చెల్లించిందంటూ ముక్తకంఠంతో నిరసన వ్యక్తం చేశారు.
అయితే ఈ సమావేశంలో సిద్దూ, చెన్నీ ఇద్దరూ వుండొద్దని, బయటికి వెళ్లిపోవాలని అభ్యర్థులు డిమాండ్ చేశారు. వీరు వెళ్లిపోతే తాము స్వేచ్ఛగా అభిప్రాయాలు చెప్పడానికి వీలుంటుందని తెగేసి చెప్పారు. ఓటమికి ప్రతిపక్షాలు బాధ్యత కాదని, కేవలం చెన్నీ, సిద్దూ, సునీల్ ఝాకడ్ వల్లే ఈ దుస్థితి అంటూ అభ్యర్థులు ఈ సమావేశంలో విరుచుకుపడ్డారు. ఇక మరి కొంత మంది అభ్యర్థులు రాష్ట్ర వ్యవహారాల మాజీ ఇన్చార్జీ హరీశ్ రావత్పై విరుచుకుపడ్డారు. ఆయన టిక్కెట్లను అమ్ముకున్నారంటూ మండిపడ్డారు. రాజధానిలోనే వుంటూ వుండేవారని, క్షేత్ర స్థాయిలోకి ఎన్నడూ వెళ్లలేదని అభ్యర్థులు హరీశ్ రావత్పై భగ్గుమన్నారు.