అహ్మదాబాద్ : ఇండియన్ ప్రీమియర్ లీగ్లో పంజాబ్ కింగ్స్ జట్టు కెప్టెన్ కెప్టెన్ కేఎల్ రాహుల్ ఆసుపత్రిలో చేరాడు. తీవ్రమైన అపెండిసైటిస్తో బాధపడుతున్నట్లు ఫ్రాంచైజీ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపింది. కేఎల్ రాహుల్ శనివారం రాత్రి తీవ్రమైన పొత్తి కడుపు నొప్పితో బాధపడుతున్నట్లు ఫిర్యాదు చేశాడని, మెడికేషన్కు స్పందించకపోవడంతో తర్వాత ఎమర్జెన్సీ రూమ్కు తరలించామని పేర్కొంది. తర్వాత పరీక్షలు చేయగా.. తీవ్రమైన అపెండిసైటిస్ ఉన్నట్లు తేలిందని చెప్పింది. అపెండిసైటిస్కు ఆపరేషన్ చేయనున్నట్లు తెలిపింది.
ఈ మేరకు దవాఖానకు తరలించినట్లు పంజాబ్ కింగ్స్ యాజమాన్యం ట్వీట్ చేసింది. రాహుల్ త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు ట్వీట్ చేసింది. ఇదిలా ఉండగా.. ఈ సీజన్లో కేఎల్ రాహుల్ ఇప్పటి వరకు ఏడు మ్యాచులు ఆడగా.. 331 పరుగులు సాధించాడు. శుక్రవారం ఆర్సీబీతో జరిగిన మ్యాచ్లో 91 పరుగులు చేయగా.. సీజన్లో ఇప్పటి వరకు నాలుగు అర్ధ సెంచరీలు చేశాడు. ఇప్పటి వరకు పంజాబ్ కింగ్స్ ఏడు మ్యాచులు ఆడగా.. మూడు మ్యాచ్లు గెలిచి, మరో నాలుగింట్లో ఓడిపోయింది. ఆరు పాయింట్లతో టేబుల్లో ఐదో స్థానంలో కొనసాగుతోంది. ఇవాళ పంజాబ్ కింగ్స్ అహ్మదాబాద్ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్తో తలపడనుంది. ఈ మ్యాచ్కు యూనివర్సల్ బాస్ క్రిస్గేల్ కెప్టెన్గా వ్యవహరించనున్నాడు.