అమృత్సర్: వ్యవసాయ చట్టాలకు నిరసనగా దేశరాజధాని ఢిల్లీలో చేపట్టిన ఆందోళన ఆరు మాసాలు పూర్తి చేసుకున్న సందర్భంగా పంజాబ్లో రైతులు బుధవారం ఇళ్లపై, వాహనాలపై నల్లజెండాలు ఎగురవేసి.. పలుచోట్ల ప్రధాని నరేంద్ర మోదీ దిష్టిబొమ్మలు దగ్ధం చేశారు. ఢిల్లీ సరిహద్దుల్లో ఆరు నెలలుగా ఆందోళన నిర్వహిస్తున్న సంయుక్త కిసాన్ మోర్చా పిలుపు మేరకు ఈ నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. అమృత్ సర్ జిల్లాలోని పాంధేర్ కలాన్, ఛాబా గ్రామాల్లో రైతులు ప్రధాని దిష్టిబొమ్మలు తగులబెట్టారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వారు నినాదాలు చేశారు. వల్లజెండాలు ఎగరేయడంతోపాటుగా పలు ప్రాంతాల్లో రైతులు నల్ల తలపాగాలు కట్టుకుని, నల్ల దుస్తులు ధరించి నిరసన తెలిపారు. కొత్త వ్యవసాయ చట్టాలను పూర్తిగా ఉపసంహరించుకనేంత వరకు విశ్రమించబోమని కిసాన్ మజ్దూర్ సంఘర్ష్ సమితి ప్రధాన కార్యదర్శి సరవన్సింగ్ పాంధేర్ మీడియాకు చెప్పారు.