లక్నో: పంజాబ్ లో ముస్లింలు అధికంగా ఉండే మాలేర్కోట్ల ప్రాంతాన్ని ప్రత్యేక జిల్లాగా ఏర్పాటు చేయడాన్ని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ తీవ్రంగా వ్యతిరేకించారు. కాంగ్రెస్ విచ్ఛిన్నకర రాజకీయాలకు ఇది అద్దం పడుతున్నదని అన్నారు. పంజాబ్ సీఎం అమరిందర్ సింగ్ ఈదుల్ ఫితర్ రోజున ఈ కొత్త జిల్లా ఏర్పాటును ప్రకటించారు. మాలేర్కోట్ల పంజాబ్ లో 23 జిల్లా అవుతుంది. ఇది ఎప్పటి నుంచో ఉన్న డిమాండ్ అని గుర్తు చేశారు. కొత్త జిల్లాకు వైద్య కళాశాలతో సహా పలు ఇతర వరాలు కూడా ప్రకటించారు. అయితే ఇలా మత ప్రాతిపదికన ఎలాంటి చర్యలు తీసుకున్నా అవి భారత రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని యూపీ సీఎం ట్విట్టర్లో విమర్శించారు. దీనిపై పంజాబ్ సీఎం అమరిందర్ కూడా ఘాటుగానే స్పందించారు. పంజాబ్ సంప్రదాయాలేమిటో ఆయనకేం తెలుసు? మాలేర్ కోట్లకు సిక్కుమతంతో గల సంబంధాలు ఆయనకు తెలుసునా? భారత రాజ్యాంగం గురించి ఆయనకు ఏం తెలుసు? యూపీలో రోజూ తన ప్రభుత్వం ద్వారా ఆయన అణగదొక్కేది ఆ రాజ్యాంగాన్నే కదా? అని అమరిందర్ దుయ్యబట్టారు.