చండీఘఢ్ : నరేంద్ర మోదీ సారధ్యంలోని కేంద్ర ప్రభుత్వం ఇతర రాష్ట్రాలకు చెందిన అధికారులను తమపై రుద్దుతోందని పంజాబ్ సీఎం భగవంత్ మాన్ మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం చండీఘఢ్ ప్రభుత్వ యంత్రాంగంలోకి ఇతర రాష్ట్రాలు, సర్వీసులకు చెందిన అధికారులను చొప్పిస్తోందని మాన్ సోమవారం ట్వీట్ చేశారు.
ఇది పంజాబ్ పునర్వ్యవస్ధీకరణ చట్టం 1966 స్ఫూర్తికి విరుద్ధమని వ్యాఖ్యానించారు. చండీఘఢ్పై తమకున్న చట్టబద్ధ హక్కుల కోసం పంజాబ్ గట్టిగా పోరాడుతుందని స్పష్టం చేశారు. కాగా చండీఘఢ్లో పోలీస్ అధికారులను ఉద్దేశించి కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాట్లాడుతూ చండీఘఢ్ కేంద్ర పాలిత ఉద్యోగులు ఇక నుంచి కేంద్ర ప్రభుత్వ నిబంధనల కింద పనిచేస్తారని చెప్పారు.
ఈ నిర్ణయం ఉద్యోగులకు మేలు చేకూరుస్తుందని చెప్పారు. పదవీవిరమణ వయసు కూడా 58 నుంచి 60 ఏండ్లకు పెరుగుతుందని అన్నారు. విద్యా రంగంలో పనిచేస్తున్న ఉద్యోగులు 65 ఏండ్లకు పదవీ విరమణ చేస్తారని చెప్పారు. టీచర్లు చైల్డ్ ఎడ్యుకేషన్ అలవెన్సు కూడా పొందుతారని అమిత్ షా పేర్కొన్నారు. మహిళా ఉద్యోగులు రెండేండ్ల పాటు మెటర్నిటీ లీవ్ పొందుతారని తెలిపారు.