చండీఘఢ్ : రానున్న గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, కాషాయ పార్టీలను మట్టికరిపించి ఆమ్ ఆద్మీ పార్టీకి (ఆప్) అధికారం అప్పగించాలని ఆ రాష్ట్ర ప్రజలకు పంజాబ్ సీఎం భగవంత్ మాన్ విజ్ఞప్తి చేశారు. ఆ రెండు పార్టీలు ఎమ్మెల్యేల కొనుగోళ్లు, అమ్మకాలకు పాల్పడటం మినహా రాష్ట్ర అభివృద్ధికి పాటుపడతాయనే విశ్వాసం లేదని అన్నారు. బీజేపీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తుండగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అమ్ముడుపోతున్నారని ఆరోపించారు.
కాంగ్రెస్ను నమ్మరాదని మార్పు దిశగా ఆప్నకు పట్టం కట్టాలని అహ్మదాబాద్లో శనివారం జరిగిన ఓ కార్యక్రమంలో మాన్ గుజరాతీలకు పిలుపు ఇచ్చారు. గుజరాత్లో భారీ మెజారిటీతో ఆప్ అధికారంలోకి వస్తుందని నివేదిక రావడంతో బీజేపీ, కాంగ్రెస్ల మధ్య రహస్య భేటీ జరిగిందని, ఎలాగైనా ఆప్ను అధికారంలోకి రాకుండా అడ్డుకోవాలని ఆ పార్టీలు ప్రయత్నిస్తున్నాయని ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు.
ఈ ఏడాది చివరిలో గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా కేజ్రీవాల్, భగవంత్ మాన్లు శనివారం నుంచి రెండు రోజుల పాటు రాష్ట్రంలో పర్యటిస్తారు. వీరు ఇద్దరు కలిసి నాలుగు బహిరంగ సభల్లో పాల్గొననుండగా కేజ్రీవాల్ పార్టీ నేతలు, కార్యకర్తలతో కూడా సమావేశం కానున్నారు. ఈ పర్యటనలో వీరితో పాటు ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా, ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా కూడా పాల్గొంటున్నారు.