చండీఘఢ్ : ఎన్నికల నియమావళిని ఉల్లంఘించడంతో పాటు ఇతర పార్టీలపై పసలేని ఆరోపణలను చేశారని శిరోమణి అకాలీదళ్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఆప్ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్పై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని పంజాబ్ ఎన్నికల ప్రధానాధికారి సాహిబ్జద అజిత్సింగ్ నగర్ పోలీసులను ఆదేశించారు.
ఎన్నికల ప్రచార సమయం ముగిసిన తర్వాత ప్రచారం చేశారని అకాలీదళ్ చీఫ్ సుఖ్బీర్ సింగ్ బాదల్పై చర్యలు చేపట్టాలని కోరుతూ ఆప్ సైతం ఈసీకి ఫిర్యాదు చేసింది. ఇక శుక్రవారం సాయంత్రం ప్రచార సమయం పూర్తయిన తర్వాత మన్సా నియోజకవర్గంలో ఇంటింటి ప్రచారం చేశారని పంజాబ్ సీఎం చరణ్జిత్ సింగ్ చన్నీ, కాంగ్రెస్ అభ్యర్ధి సిద్ధూ మూస్వాలాపైనా కేసు నమోదైంది.
ఇక ఫిబ్రవరి 20న ఒకే దశలో పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా మార్చి 10న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు ప్రకటిస్తారు. ఈ ఎన్నికల్లో గెలుపు కోసం పాలక కాంగ్రెస్ పావులు కదుపుతుండగా, ప్రభుత్వ వ్యతిరేకతతో గట్టెక్కాలని ఆప్ సర్వశక్తులూ ఒడ్డుతోంది. ప్రధాన పార్టీలకు దీటైన పోటీ ఇచ్చేందుకు బీజేపీ-పీఎల్సీ కూటమి, ఎస్ఏడీలు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి.