ముంబై: కరోనా నేపథ్యంలో వెలవెలబోతున్న సెలూన్ షాపునకు కస్టమర్లను ఆకట్టుకునేందు ఒక ఓనర్ వినూత్న ప్రయత్నం చేశాడు. ఏకంగా బంగారంతో ఒక రేజర్ను తయారు చేయించాడు. పూణేకు చెందిన అవినాష్ బోరుండియా సెలూన్ షాపు నిర్వహిస్తున్నారు. అయితే కరోనా నేపథ్యంలో కస్టమర్ల రాక బాగా తగ్గింది. దీంతో వ్యాపారం పెంచేందుకు వినూత్నంగా ఆలోచించాడు.
కస్టమర్లను ఆకట్టుకునేందుకు అవినాష్ 80 గ్రామల బంగారంతో రేజర్ తయారు చేయించాడు. దీని కోసం రూ.4 లక్షలు ఖర్చుపెట్టాడు. సెలూన్ షాపును కూడా రీమోడల్ చేశాడు. బీజేపీ ఎమ్మెల్యే గోపీచంద్ పద్వాకర్తో ఇటీవల సెలూన్ షాపును పునఃప్రారంభించాడు. అంతేగాక గోల్డెన్ రేజర్తో సెలూన్ సేవలపై ప్రచారం చేశాడు.
దీంతో ప్రస్తుతం కస్టమర్ల సంఖ్య పెరుగుతున్నదని అవినాష్ తెలిపారు. బంగారం రేజర్తో గడ్డం చేసేందుకు రూ.వంద వసూలు చేస్తున్నట్లు చెప్పాడు. కొంత మంది అంత ఇచ్చుకోలేకపోయినా వారి సంతృప్తి కోసం గోల్డెన్ రేజర్తో సెలూన్ సేవలు అందిస్తున్నట్లు వెల్లడించాడు.