తలెత్తి పైకి చూస్తే.. సవాలు విసురుతున్నట్టు అనిపిస్తాయి అంతెత్తు పర్వతాలు. శిఖరాన్ని అధిరోహించాక.. తలవంచి కిందికి చూస్తే.. సలాము చేస్తున్నట్టు కనిపిస్తాయి. అంతెత్తు పర్వతాలు. ఆఫ్రికా ఖండం, టాంజానియా దేశంలోని కిలిమంజారో పర్వతం.. పులకిత హస్వికి ఆ విజయానుభూతిని అందించింది.
మంచిర్యాల జిల్లాకు చెందిన మురికి వెంకట్, మాధవిశ్రీల కూతురు పులకిత హస్వి. గతనెల 29న ప్రపంచంలోని ఏడు అత్యంత ఎత్తయిన శిఖరాలలో ఒకటైన కిలిమంజారోను అధిరోహించింది. వెంకట్ హైదరాబాద్లో విద్యాసంస్థలు నిర్వహిస్తున్నారు. పులకిత తన తండ్రి విద్యాసంస్థలో తొమ్మిదో తరగతి చదువుతున్నది. పులకిత అన్నయ్య హర్షోహిత్ కూడా నేషనల్ స్కేటర్.
కిలిమంజారో అధిరోహణ..
ఆఫ్రికాలోనే అత్యంత ఎత్తయిన పర్వతం అయిన కిలిమంజారోను అధిరోహించడానికి గుండెనిండా విశ్వాసంతో హైదరాబాద్ నుంచి బయల్దేరింది హస్వి. బలమైన చల్ల గాలులను, ఎముకలు కొరికే చలిని (-15 డిగ్రీ సెల్సియస్), దట్టమైన మంచుపొగను.. మొత్తంగా ఇబ్బందికరమైన వాతావరణాన్ని తట్టుకుంటూ ముందుకెళ్లింది. శిఖరాన్ని చేరుకునేందుకు హస్వి 16 గంటల పాటు నడిచింది. అలా 5,895 మీటర్ల వరకూ ప్రయాణం నిరాటంకంగా సాగింది. ప్రొఫెషనల్ పర్వతారోహకులు నిర్వహిస్తున్న బూట్స్ అండ్ క్రాంపాన్స్ అడ్వెంచర్ కంపెనీలో హస్వి చైల్డ్ ఇన్ఫ్లుయెన్సర్ కావడం విశేషం. రాబోయే రోజుల్లో మొత్తం ఏడు అత్యున్నత శిఖరాలనూ అధిరోహించాలన్నది హస్వి ఆకాంక్ష.
‘సైక్లింగ్, బ్యాడ్మింటన్ నా ఫిట్నెస్కు ఎంతగానో దోహదపడుతున్నాయి. తల్లిదండ్రులు, కోచ్ సహకారంతోనే విజయం సాధ్యమైంది’ అని సగర్వంగా చెబుతున్నది హస్వి. స్కేటింగ్లో నేషనల్ పోటీల్లోనూ పాల్గొని బహుమతులు సాధించింది. హస్వి చదువుల్లోనూ ముందుంటుంది. చురుకైన విద్యార్థిగా పేరు తెచ్చుకుంది.
… కొమ్మెర రామమూర్తి