వరంగల్ : రాష్ట్ర ప్రభుత్వం విద్యకు అధిక ప్రాధాన్యం ఇస్తుందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. ప్రభుత్వ పాఠశాలలన్నింటిని కార్పొరేట్ స్థాయిలో తీర్చిదిద్దేందుకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు మన ఊరు- మన బడి కార్యక్రమాన్ని అమల్లోకి తెచ్చినట్లు చెప్పారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం బోధించేందుకు ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నట్లు మంత్రి తెలిపారు.
జిల్లాలోని రాయపర్తి మండలం కొండూరు గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో రూ. 32 లక్షలతో మౌలిక వసతులు కల్పించే పనులకు దయాకర్ రావు శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ గోపి, జిల్లా విద్యాశాఖ అధికారి వాసంతితో పాటు వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ నేతలు పాల్గొన్నారు.