వరుస వానలకు ఉప్పొంగిన వాగులు, వంకలు
పాక్షికంగా దెబ్బతిన్న ఇండ్లు 98, పూర్తిగా కూలినవి 4
వరద పోటెత్తి ధ్వంసమైన రోడ్లు
విరిగిన విద్యుత్ స్తంభాలు
ముంపు ప్రాంతాల ప్రజల కోసం ప్రత్యేక శిబిరాలు
కురవిలో రెండు, జిల్లాకేంద్రంలో 11 కేంద్రాల్లో 81మందికి వసతి
ఎలాంటి పంట నష్టం జరుగలేదని అధికారుల వెల్లడి
కుంభవృష్టిగా కురిసిన వానలకు జిల్లా అతలాకుతలమైంది. వారం రోజులుగా సూర్యుడు కనిపించకుండా మబ్బులు పట్టేయడం, ముసురు కమ్ముకోవడంతో జన జీవనం స్తంభించింది. వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహించగా, చెరువులు, కుంటలు మత్తడి పోశాయి. గురువారం వరుణుడు కాస్త గెరువివ్వడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. కాగా, ఏకధాటిగా కురిసిన వర్షాలకు జిల్లాలోని అనేక గ్రామాల్లో రోడ్లు దెబ్బతినగా, ఇండ్లు నేలమట్టమయ్యాయి. విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. ఈ నేపథ్యంలో అధికారులు జరిగిన నష్టాన్ని ప్రాథమికంగా అంచనా వేశారు. జిల్లావ్యాప్తంగా 98 ఇండ్లు పాక్షింగా దెబ్బతినగా, 4 ఇండ్లు పూర్తిగా కూలిపోయాయి. ఇంత పెద్దమొత్తంలో ఇండ్లకు నష్టం వాటిల్లడం ఇదే మొదటిసారని అధికారులు తెలిపారు. తొర్రూరు, పెద్దవంగర మండలాల్లో ఒకటి చొప్పున, కొత్తగూడ మండలంలో మూడు మొత్తం ఐదు రోడ్లు ధ్వంసమయ్యాయి. ఒక్క పెద్దవంగర మండలంలోనే ఏడు విద్యుత్ స్తంభాలు విరిగిపోయాయి. లోతట్టు ప్రాంతాల ప్రజల కోసం జిల్లాకేంద్రంలో 11, కురవి మండలం కొత్తూరు(సి)గ్రామంలో ఒక శిబిరం ఏర్పాటు చేసి 81మందికి వసతి కల్పించారు. కాగా వరుసగా వానలు కురిసినా జిల్లాలో ఎలాంటి పంటనష్టం జరుగలేదని వ్యవసాయ అధికారులు తెలిపారు.
మహబూబాబాద్, జూలై 14 (నమస్తే తెలంగాణ) : వారం రోజు లు వరుసగా కురిసిన వానలకు జిల్లా అతలాకుతలమైంది. ప్రజలు ఇండ్లకే పరిమితం కాగా, వరద పోటెత్తి వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహించాయి. చెరువులు, కుంటలు మత్తడి పోశాయి. గురువారం వరుణుడు కాస్త గెరువివ్వడంతో జనం కాస్త ఊపిరి పీల్చుకున్నారు. ఈ నేపథ్యంలో అధికారులు జరిగిన నష్టాన్ని ప్రాథమికంగా అంచనా వేశారు. జిల్లాలో 98 ఇండ్లు పాక్షికంగా దెబ్బతినగా, 4 ఇండ్లు పూర్తి కూలిపోయనట్లు అంచనా వేశారు. ఇంత పెద్దఎత్తున ఇండ్లకు నష్టం వాటిల్లడం ఇదే మొదటిసారని అధికారులు చెబుతున్నారు. మహబూబాబాద్ మండలంలో 5, కురవి మండలంలో 9, కొత్తగూడలో 13, కేసముద్రం మండలంలో 2, గూడూరులో 3, గార్లలో 3, గంగారంలో ఒకటి, డోర్నకల్లో 4, బయ్యారంలో 2, చిన్నగూడూరులో ఒకటి, దంతాలపల్లిలో 10, మరిపెడలో 16, నెల్లికుదురులో 11, నర్సింహులపేటలో ఒకటి, పెద్దవంగరలో 9, తొర్రూరు మండలంలో 8 ఇండ్లు పాక్షికంగా దెబ్బతినగా, నెల్లికుదురు మండలంలో ఒకటి, చిన్నగూడూరు మండలంలో 3 ఇండ్లు పూర్తిగా కూలిపోయాయి. వరద పోటెత్తడంతో ఐదు ప్రాంతాల్లో రోడ్లు దెబ్బతిన్నట్లు అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. తొర్రూరు, పెద్దవంగర మండలాల్లో ఒకటి చొప్పున, కొత్తగూడ మండలంలో 3 మొత్తం ఐదు రోడ్లు ధ్వంసమైనట్లు అంచనా వేశారు. అదేవిధంగా ఒక్క పెద్దవంగర మండలంలో 7 విద్యుత్ స్తంభాలు విరిగిపోయాయి. భారీ వర్షాల నేపథ్యంలో లోతట్టు, ముంపు ప్రాంతాల్లో నివాసముంటున్న వారి కోసం ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేసి 81 మందికి వసతి కల్పించారు.
కురవి మండలంలో కొత్తూరు (సి) గ్రామంలో శిబిరం ఏర్పాటు చేసి 20మంది, తిరుమలాపురంలో ఒక శిబిరం ఏర్పాటు చేసి నలుగురికి వసతి కల్పించారు. జిల్లా కేంద్రంలో 11శిబిరాలు ఏర్పాటు చేసి 57 మందికి వసతి కల్పించారు. కాగా, వరుసగా కురిసిన వానలతో కొత్తగూడ, బయ్యారం, గార్ల మండలాల ప్రజలు ఎక్కువగా ఇబ్బందిపడ్డారు. నర్సంపేట- కొత్తగూడ, బయ్యారం- ఇల్లందు, బయ్యారం- గార్ల, బయ్యారం- మొట్లతిమ్మాపురం గ్రామాల మధ్య నీటి ప్రవాహంతో నాలుగు రోజులపాటు రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వర్షాలు, వరద ఉధృతి తగ్గిన తర్వాత దెబ్బతిన్న రోడ్లకు మరమ్మతు చేపట్టేలా అధికారులు కార్యాచరణ రూపొందిస్తున్నారు. వరుసగా వర్షాలు కురిసినా పంటలకు ఎలాంటి నష్టం జరుగలేదని వ్యవసాయ అధికారులు అంచనా వేశారు. ఉద్యాన పంటలు కూడా దెబ్బతినలేదని ఉద్యాన శాఖ జిల్లా అధికారి సూర్యానారాయణ తెలిపారు.
బుధవారం రాత్రి నుంచి గురువారం సాయంత్రం వర్షం లేకపోవడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. వారం రోజులుగా బయటకు రాని జనం కాస్త గెరువివ్వడంతో నిత్యావసరాలు, వివిధ పనుల నిమిత్తం రావడంతో జిల్లా కేంద్రం కిటకిటలాడింది. గడిచిన 24 గంటల్లో జిల్లాలో 6.7మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. కొత్తగూడ మండలంలో 20.6మిల్లీమీటర్లు, బయ్యారంలో 5.6, గార్లలో 5.2, డోర్నకల్లో 5.0, కురవిలో 3.2, మహబూబాబాద్లో 7.0, గూడూరులో 11.0, కేసముద్రంలో 4.2, నెల్లికుదురులో 5.2, నర్సింహులపేటలో 2.6, మరిపెడలో 2.8, తొర్రూరులో 8.3 మిల్లిమీటర్లు, గంగారం, చిన్నగూడూరు, దంతాలపల్లి, పెద్దవంగర మండలాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది.