ఎల్బీనగర్ జోన్బృందం, ఆగస్టు 13: భారత స్వతంత్ర వజ్రోత్సవాలను ఎల్బీనగర్ నియోజకవర్గం వ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తున్నారు. జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో రోజుకో కార్యక్రమాన్ని నిర్వహిస్తూ వజ్రోత్సవాలకు వన్నె తెస్తున్నారు. శనివారం సరూర్నగర్ సర్కిల్ కార్యాలయం నుంచి కొత్తపేట చౌరస్తా వరకు పాఠశాలల విద్యార్థులు, జీహెచ్ఎంసీ సిబ్బంది, ఉద్యోగులతో కలిసి ఫ్రీడం రన్ను నిర్వహించారు. సర్కిల్ కార్యలయం వద్ద ఎమ్మెల్సీ బొగ్గారపు దయానంద్ గుప్తా, రంగారెడ్డి జిల్లా డీఎస్డీవో వెంకటేశ్వర్రావు, సరూర్నగర్ సర్కిల్ ఉప కమిషనర్ హరి కృష్ణయ్య జెండా ఊపి ప్రారంభించారు. ఉద్యోగులు, విద్యార్థులు జాతీయ పతాకాలను చేతబూని నినాదాలు చేస్తూ ర్యాలీలో ముందుకు సాగారు. ఈ ర్యాలీలో డీపీవో విక్రాంత్రెడ్డి, సరూర్నగర్ హైస్కూల్ ఉపాధ్యాయుడు రాఘవరెడ్డి, సూపరింటెండెంట్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.