హైదరాబాద్ : ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద మరణించిన రైతుల కుటుంబాలకు ప్రభుత్వం వెంటనే రూ. కోటి ఎక్స్గ్రేషియా ( Ex-gratia ) ను అందజేయాలని బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి టీ.జీవన్ రెడ్డి ( Jeevan Reddy ) డిమాండ్ చేశారు. ఆదివారం తెలంగాణ భవన్లో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
కాంగ్రెస్ అవలంభిస్తున్న నిర్లక్ష్య వైఖరీతోనే మరికొందరు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ప్రస్తుతం ధాన్యం కొనుగోలులో రైతులు పడుతున్న ఇబ్బందులను నిన్నటి కేబినెట్లో ఎందుకు చర్చించలేదని ప్రశ్నించారు. ధాన్యం కొనుగోలులో రైతులు క్వింటాల్కు రూ. 250 నష్టపోతున్నారని, దీనిని ఆర్అండ్ఆర్ ట్యాక్స్గా పరిగణించాల్సి వస్తుందని పేర్కొన్నారు .
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత రైతులను ఘోరంగా మోసం చేస్తుందని ఆరోపించారు.రైతు డిక్లరేషన్ పేరుతో రాహుల్ గాంధీ రైతులను మోసం చేశాడని విమర్శించారు.కేసీఆర్ హయాంలో రైతులకు రైతు బంధు పంట పంటకు వస్తుండేదని అన్నారు.కరీంనగర్ జిల్లా ఇన్చార్జి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఏనాడు కరీంనగర్ రాలేదు , ధాన్యం కొనుగోలు పై రివ్యూ చేయలేదని ఆరోపించారు.
అందాల పోటీలు, ఫుట్బాల్ పోటీల నిర్వహణపై పెట్టిన శ్రద్ధ రేవంత్ రెడ్డి రైతాంగ సమస్యలపై ఒక్క రివ్యూ చేయలేదని మండిపడ్డారు. ధాన్యం ఇంకా 50 శాతం కల్లాలోనే ఉంది. అకాల వర్షాలకు రైతులు ఇబ్బందులు పడుతున్నారు.మొక్క జొన్న కొనుగోలులో పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నారని తెలిపారు.ఫ్యూచర్ సిటీపై హరీష్ రావు చేసిన వ్యాఖ్యలతో మంత్రి శ్రీధర్ బాబు ఉలిక్కి పడుతున్నాడని పేర్కొన్నారు.
ఫార్మా సిటీ భూములను రేవంత్ రెడ్డి అనుచరులకు కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారని దుయ్యబట్టారు. ధాన్యం కొనుగోలు విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి స్పష్టత లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు. స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తే బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందో రాదో పీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్ గౌడ్కు అర్థమవుతుందని అన్నారు.
రాష్ట్రంలో రేవంత్ రెడ్డి పోవాలా. కేసీఆర్ రావాల అనే నినాదం ప్రజల నుంచి మొదలైందన్నారు. మే 31వ తేదీ లోపు రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు చేయలేక పోతే జూన్ 2 న తెలంగాణ ఆవిర్భావ వేడుకల రోజున రేవంత్ రెడ్డి జెండా ఆవిష్కరించే హక్కు లేదని స్పష్టం చేశారు.