షిమ్లా : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొనే సమావేశం కవరేజికి హిమాచల్ప్రదేశ్ ప్రభుత్వం కొత్త షరతులు విధించి నవ్వుల పాలైంది. మోదీ మీటింగ్ కవరేజ్కు వచ్చే జర్నలిస్టులు, ఫొటోగ్రాఫర్లు క్యారెక్టర్ సర్టిఫికేట్ సమర్పించాలని జైరాం ఠాకూర్ ప్రభుత్వం ఆదేశించింది. దీనిపై సర్వత్రా నిరసనలు వ్యక్తం కావడంతో బీజేపీ ప్రభుత్వం యూ టర్న్ తీసుకున్నది. అబ్బే క్యారెక్టర్ సర్టిఫికేట్ ఏం అవసరం లేదు.. కవరేజికి రండి సార్.. అంటూ జర్నలిస్టులను మచ్చిక చేసుకునే పనిలో నిమగ్నమైంది. బిలాస్పూర్ జిల్లా డీపీఆర్ఓ జారీ చేసిన క్యారెక్టర్ సర్టిఫికేట్ ఉత్తర్వులను ప్రభుత్వం ఉపసంహరించుని దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించింది.
ప్రధాని నరేంద్ర మోదీ రేపు హిమాచల్ప్రదేశ్లో పర్యటించనున్నారు. కిరాత్పూర్-మనాలి ఫోర్లేన్ను ప్రారంభించేందుకు మోదీ బుధవారం బిలాస్పూర్, కులు వస్తున్నారు. అయితే, మోదీ పర్యటనను కవరేజ్ చేసేందుకు జర్నలిస్టులు, వీడియోగ్రాఫర్లు, ఫొటోగ్రాఫర్లు విధిగా క్యారెక్టర్ సర్టిఫికేట్ దాఖలు చేయాలని, ఆ సర్టిఫికేట్ ఇస్తే కవరేజికి అనుమతి ఇస్తామని బిలాస్పూర్ జిల్లా ప్రజాసంబంధాల అధికారి ఉత్తర్వులు జారీ చేశారు. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచే దూరదర్శన్ కేంద్రం, ఆలిండియా రేడియో బృందాన్ని కూడా డీపీఆర్ఓ విడిచిపెట్టలేదు. క్యారెక్టర్ సర్టిఫికేట్ ఇచ్చిన తర్వాత వారికి కవరేజ్ ఎంట్రీ లభిస్తుందో లేదో డీపీఆర్ఓ కార్యాలయం నిర్ణయిస్తుందని తన ఉత్తర్వుల్లో పేర్కొనడం విశేషం.
ఈ వివాదం ముదిరిపోవడంతో బీజేపీ నేతలు, ఉన్నతాధికారులు వెంటనే సర్దుకునే పనిలో నిమగ్నమయ్యారు. జర్నలిస్టులకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నామంటూ హిమాచల్ప్రదేశ్ డీజీపీ సంజయ్ కుందూ ఈ మేరకు ట్వీట్ చేశారు. ప్రధాని ర్యాలీ కవరేజకి జర్నలిస్టులకు స్వాగతం.. హిమాచల్ప్రదేశ్ పోలీసులు జర్నలిస్టులకు కవరేజీలో సహకరిస్తారు.. అని డీజీపీ కుందూ తన ట్వీట్లో పేర్కొన్నారు. అంతకుముందు బిలాస్పూర్ డీపీఆర్ఓ ఇచ్చిన ఉత్తర్వులను అధికారులు ఉపసంహరించుకున్నారు.
All journalists are most welcome to cover Hon’ble Prime Minister’s visit to Himachal Pradesh tomorrow 5th October, 2022.
Himachal Pradesh Police will facilitate their coverage.
Any inconvenience is regretted.
— Sanjay Kundu, IPS (@sanjaykunduIPS) October 4, 2022
హిమాచల్ప్రదేశ్లో మోదీ సభకు వచ్చే జర్నలిస్టులు క్యారెక్టర్ సర్టిఫికెట్ ఇవ్వాలని బీజేపీ నేతలు డిమాండ్ చేయడాన్ని విపక్షాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. మోదీ సభకు వచ్చే జర్నలిస్టులను క్యారెక్టర్ సర్టిఫికేట్ కావాలని అడగడం విడ్డూరంగా ఉన్నదని కాంగ్రెస్ అధికార ప్రతినిధి ఆల్కా లంబా తీవ్రంగా స్పందించారు. క్యారెక్టర్ లేని బీజేపీ నేతలు జర్నలిస్టులకు క్యారెక్టర్ సర్టిఫికేట్ దాఖలు చేయాలని కోరడమేంటని ఆల్కా లంబా ప్రశ్నించారు.