Srisailam | సామాన్య భక్తులకు వసతుల కల్పన కోసం శ్రీశైలం మహా క్షేత్ర దేవస్థానం నిబంధనల్లో మార్పులు తెస్తున్నది. ఇందుకోసం ప్రముఖుల ప్రొటోకాల్, మహా మంగళహారతి దర్శన విధానాల్లో తీసుకొచ్చే ఖచ్చితమైన మార్పుల అమలుకు సహకరించాలని దేవస్థానం ఈవో ఎస్ లవన్న కోరారు. వారాంతంలో శ్రీశైలం దేవస్థానాన్ని సందర్శించే కొందరు భక్తులు వివిధ శాఖల సిఫారసు లేఖలో వస్తున్నారు. దీంతో సామాన్య భక్తులకు వసతి గదులను కేటాయించడంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తున్నదని చెప్పారు.
ఈ నేపథ్యంలో ప్రొటోకాల్ దర్శనాల కేటాయింపులో ఆంక్షల అమలు కఠినతరం చేస్తున్నట్లు ఎస్ లవన్న పేర్కొన్నారు. రోజురోజుకు క్షేత్ర దర్శనానికి వచ్చే యాత్రికుల సంఖ్య పెరుగుతుండటంతో ఆర్జిత సేవల సమయ పాలన కొనసాగించాల్సి ఉందన్నారు. అలాగే, సామాన్య భక్తుల దర్శనాలకూ ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాల్సి ఉందని చెప్పారు. కనుక ప్రముఖుల ప్రోటోకాల్ దర్శన బుకింగ్ కొరకు సంబంధిత శాఖ లెటర్ హెడ్తో సిఫారసు లేఖ కనీసం రెండు రోజుల ముందు దేవస్థానం వసతి కల్పన విభాగం వారికి పంపాలని తెలిపారు.
ప్రతిరోజు ప్రముఖుల దర్శనాలను ఉదయం 05:30 నుండి 06:15 వరకు, సాయంత్రం 07:00 నుండి 07:30 వరకు విరామ దర్శనం కల్పిస్తామని లవన్న తెలిపారు. వారికి అభిషేకము, కుంకుమార్చన జరిపిస్తామన్నారు. అదే టైంలో సామాన్య భక్తులకు జరిగే సర్వదర్శనాలు నిరాటంకంగా కొనసాగిస్తామన్నారు.
ప్రధానంగా ప్రముఖుల సిఫారసుల వివరాలు కనీసం రెండు రోజుల ముందే దేవస్థానం వారికి protocol@srisailadevasthanam.org మెయిల్ ఐడీకి లెటర్హెడ్పై తెలియజేయాలని కోరారు. క్షేత్రాభివృద్దితోపాటు భక్తుల ఆధ్యాత్మిక మనోభావాలకు కూడా పెద్దపీట వేస్తూ దర్శన విధానాల్లో తెచ్చిన మార్పులను ప్రతి ఒక్కరూ అనుసరించాలని ఈవో లవన్నచెప్పారు.
శ్రీశైల దేవస్ధానం భక్తుల సౌకర్యార్థం నిర్వహిస్తున్న కుటీర నిర్మాణ పథకానికి రూ.15 లక్షల విరాళం ఇచ్చారు. శనివారం గుంటూరు జిల్లా తాడేపల్లి వాసి సాంబశివరావు గణేష్ సదనంలో ప్రత్యేక గది కోసం రూ. 15 లక్షల విలువైన చెక్ను ఏసీ వెంకటేష్కు అందించారు. దాతలకు శ్రీభ్రమరాంబికా మల్లికార్జున స్వామి అమ్మవార్ల దర్శనాన్ని కల్పించి ప్రత్యేక పూజలు చేయించారు. అనంతరం స్వామి అమ్మవార్ల శేషవస్త్రాలు, ప్రసాదాలు, ఙ్ఞాపిక పత్రం అందజేశారు.