నెట్వర్క్, నమస్తే తెలంగాణ, అక్టోబర్ 4: కోల్కతాలో దుర్గామాత మండపంలో జాతిపిత మహాత్మాగాంధీని అసురుడిగా చిత్రీకరించి అవమానపరచడంపై తెలంగాణవ్యాప్తంగా మంగళవారం నిరసనలు వెల్లువెత్తాయి. గాంధీజీని అవమానించిన వారి దిష్టి బొమ్మలను దగ్ధం చేశారు. పలు చోట్ల గాంధీ విగ్రహాలు, చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు. నల్లగొండ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నిరసనలు తెలిపారు. నల్లగొండ జిల్లా చిట్యాల మండలంలోని పెద్దకాపర్తి గ్రామంలో ఉన్న మహాత్మాగాంధీ గుడిలో నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య పూజలు చేశారు. అనంతరం మహాత్ముడి విగ్రహానికి క్షీరాభిషేకం చేశారు. జాతిపితను అవమానిస్తే యావత్ దేశాన్ని అవమానించినట్టేనని, కారకులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నల్లగొండ జిల్లా కేంద్రంలోని రామగిరిలో ఉన్న గాంధీ విగ్రహానికి ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి, ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో క్షీరాభిషేకం నిర్వహించారు.
యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరులో ఆర్యవైశ్య భవనం వద్ద, భువనగిరి గాంధీ పార్కులోని గాంధీ విగ్రహాలకు ఆర్యవైశ్య సంఘం నేతలు క్షీరాభిషేకం చేశారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో, తుంగతుర్తిలో టీఆర్ఎస్, ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో హిందూ మహాసభ దిష్టిబొమ్మను దహనం చేశారు. బాపూజీ విగ్రహానికి క్షీరాభిషేకం చేశారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లావ్యాప్తంగా మంగళవారం నిరసనలు వెల్లువెత్తాయి. కరీంనగర్ టవర్ సరిల్లో చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు చిట్టుమల్ల శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. వైశ్యులు వ్యాపారస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని మహాత్మాగాంధీ చిత్రపటం వద్ద కొబ్బరికాయలు కొట్టి నివాళులర్పించారు. జమ్మికుంటలో ఆర్యవైశ్య యువజన సంఘం జిల్లా అధ్యక్షుడు యాద సతీశ్ ఆధ్వర్యంలో గాంధీ చౌక్ వద్ద నిరసన తెలిపారు. గాంధీ విగ్రహానికి పాలతో అభిషేకం చేశారు. కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం జిల్లా అధ్యక్షుడు చందా రాజు, మున్సిపల్ చైర్మన్ తక్కళ్లపెల్లి రాజేశ్వర్రావు, వైస్ చైర్పర్సన్ దేశిని స్వప్న కోటి, రైస్ మిల్లర్ల సంఘం జమ్మికుంట అధ్యక్షుడు జీ రాజమౌళి పాల్గొని నిరసన తెలిపారు. హుజురాబాద్లోని జమ్మికుంటరోడ్లో గల శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరీ ఆలయ ఆవరణలోని గాంధీ విగ్రహానికి ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో గాంధీ విగ్రహానికి క్షీరాభిషేకం చేశారు. అనంతరం అఖిల భారత హిందూ మహాసభ దిష్టిబొమ్మను దహనం చేశారు. మున్సిపల్ చైర్పర్సన్ గందె రాధికా శ్రీనివాస్, వైస్ చైర్మన్ కొలిపాక నిర్మలా శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
హిందూ మహాసభ గుర్తింపు రద్దు చేయాలి
గాంధీజీకి అవమానం కలిగించేలా వ్యవహరించిన అఖిల భారత హిందూ మహాసభ గుర్తింపు రద్దు చేయాలని అంతర్జాతీయ వైశ్య ఫెడరేషన్(ఐవీఎఫ్) రాష్ట్ర అధ్యక్షుడు, రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా డిమాండ్ చేశారు. మంగళవారం నాగోల్ చౌరస్తాలో మహాత్మాగాంధీ విగ్రహానికి క్షీరాభిషేకంచేసి 108 కొబ్బరికాయలు కొట్టారు. కార్యక్రమంలో ఐవీఎఫ్ పొలిటికల్ కమిటీ చైర్మన్ బచ్చు శ్రీనివాస్ గుప్తా, కోఆర్డినేటర్ నాగరాజు గుప్తా, ఉపాధ్యక్షులు ఆలేటి రవి, నరేష్ గుప్తా, మహిళా విభాగం నాయకురాలు ఉప్పల స్వప్న పాల్గొన్నారు.
హిందూ మహాసభను నిషేధించాలి
టీఎస్పీహెచ్సీ చైర్మన్ కోలేటి
మహాత్మాగాంధీని అవమానపరిచిన హిందూ మహాసభను నిషేధించాలని తెలంగాణ రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్ డిమాండ్చేశారు. కోల్కతాలో హిందూ మహాసభ ఏర్పాటు చేసిన దుర్గామాత మండపంలో గాంధీజీని మహిషాసురుడిగా మార్చడం దుర్మార్గమైన చర్య అని పేర్కొన్నారు. గాంధీజీకి జరిగిన అవమానంపై బీజేపీ ఏం సమాధానం చెప్తుందని ప్రశ్నించారు. గాంధీని హత్య చేసింది ఎవరో ప్రపంచానికి తెలుసని, మతచాందసవాదుల వల్ల దేశానికే ప్రమాదమన్నారు. తెలంగాణలో గాంధీ చూపిన మార్గంలో పాలన సాగుతున్నదని తెలిపారు. కేసీఆర్ పెట్టనున్న జాతీయ పార్టీతో గాంధేయవాదులంతా కలిసి రానున్నారని చెప్పారు.
కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ పట్టణంలో అఖిల భారత హిందూ మహాసభ దిష్టిబొమ్మను దహనం చేస్తున్న ప్రజాప్రతిధులు, ఆర్యవైశ్యులు