చండీగఢ్ : కేంద్రం తీసుకువచ్చిన మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతుల ఆందోళన కొనసాగుతోంది. హర్యాలోని పలు చోట్ల కుండి-మనేసర్-పల్వల్ ఎక్స్ప్రెస్ హైవేను శనివారం రైతులు దిగ్బంధించారు. సంయుక్త కిసాన్ మోర్చా 24 గంటలు ఆందోళనకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. 136 కిలోమీటర్ల పొడవున్న కేఎంపీ ఎక్స్ప్రెస్ హైవేను వెస్ట్రన్ పెరిఫెరల్ ఎక్స్ప్రెస్ హైవేగా పిలుస్తారు. హైవేపై రైతులు అత్యవసర వాహనాలకు మాత్రం అనుమతి ఇస్తున్నారు. భారతీయ కిసాన్ మోర్చా యూనియన్ (లఖోవాల్) ప్రధాన కార్యదర్శి హరీందర్ సింగ్ లఖోవాల్ మాట్లాడుతూ 24 గంటల పాటు రహదారి దిగ్బంధం కొనసాగుతుందని చెప్పారు.
రైతుల ఆందోళన నేపథ్యంలో హర్యానా పోలీసులు ట్రాఫిక్కు ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టారు. ఎక్స్ప్రెస్ హైవేపై కాకుండా ఇతర మార్గాల్లో వెళ్లాలని సూచించారు. ఎక్స్ప్రెస్వేలో ట్రాఫిక్ కదలికలు, ప్రజారవాణాను సులభతరం చేసేందుకు విస్తృత ఏర్పాట్లు జరుగుతున్నాయని అదనపు డైరెక్టర్ (లా అండ్ ఆర్డర్) నవదీప్ సింగ్ విర్క్ పేర్కొన్నారు. ముఖ్యంగా ఫరీదాబాద్, గుర్గావ్, పానిపట్, రోహ్తక్, పల్వాల్, ఫరీదాబాద్, గుర్గావ్, నూహ్లో ట్రాఫిక్ మళ్లిస్తున్నట్లు పేర్కొన్నారు. కేంద్రం తీసుకువచ్చిన చట్టాలకు వ్యతిరేకంగా వందలాది మంది రైతులు ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే.