వరంగల్ : తెలంగాణ రాష్ట్రం వచ్చాకే అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లకు గౌరవ మర్యాదలు, వేతనాలు పెరిగాయని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. పరకాలలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో జరిగిన తెలంగాణ అంగన్ వాడీ టీచర్లు,హెల్పర్ల మహాసభకు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.
ఆనాడు వేతనాలు పెంచమని అడిగితే, అంగన్వాడీలను గుర్రాలతో తొక్కించారు. మహిళలని చూడకుండా లాఠీ ఛార్జీ చేయించారు. తెలంగాణ వచ్చాకే అంగన్వాడీలకు గౌరవ మర్యాదలు దక్కాయన్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత అంగన్వాడీల జీతం 13 వేల 659 రూపాయలు.
దేశంలో ఎక్కడా ఇంత పెద్ద మొత్తంలో జీతాలు ఇవ్వడం లేదని మంత్రి తెలిపారు. కేంద్రం ఇచ్చే గౌరవ వేతనంతో పనిలేకుండా సీఎం కేసీఆర్ వేతనాలు పెంచారన్నారు. అంగన్వాడీలను అక్కున చేర్చుకున్న సీఎం కేసీఆర్కు మనమంతా అండగా ఉండాలని మంత్రి కోరారు.
కార్యక్రమంలో ఎంపీ పసునూరి దయాకర్, పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మా రెడ్డి, భూపాల పల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, జెడ్పీ చైర్ పర్సన్ గండ్ర జ్యోతి, టీఆర్ఎస్ కార్మిక విభాగం అధ్యక్షుడు రాంబాబు, అంగన్వాడీ సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు నల్లా భారతి పాల్గొన్నారు.