హైదరాబాద్ : ప్రొడ్యూసర్స్ గిల్డ్పై ప్రముఖ నిర్మాత అశ్వినీదత్ అసంతృప్తి వ్యక్తం చేశారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. నిర్మాతల శ్రేయస్సు కోసమే పొడ్యూసర్స్ కౌన్సిల్ ఏర్పాటు చేసిందని, ప్రస్తుతం ప్రొడ్యూసర్స్ గిల్డ్ ఎందుకు వచ్చిందో తెలియట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రేక్షకులను థియేటర్కు రప్పించడం సవాల్గా మారిందని, సీఎంల వద్దకు వెళ్లి టికెట్ ధరలు పెంచుకోవడమే ప్రస్తుత స్థితికి కారణమని ఆరోపించారు.
సినిమాలపై ప్రేక్షకుల్లో విరక్తి కలిగిందని, ధరలు తగ్గించాలని ఒకసారి, పెంచాలని ఒకసారి చెప్పడం వల్లే ప్రేక్షకుల విరక్తి కారణమని ధ్వజమెత్తారు. టికెట్ ధరలు పెంచిన వారే షూటింగ్స్ బంద్ అని ఆందోళన చేస్తున్నారని మండిపడ్డారు. ఇష్టారీతిన హీరోలకు పారితోషకాలు ఇస్తున్నారనడం సరికాదన్న అశ్వినీదత్.. మార్కెట్ ధర ప్రకారమే హీరోలు పారితోషకాలు తీసుకుంటారన్నారు. హీరోల పారితోషకాల వల్లే టికెట్ దరలు పెంచారనేది అవాస్తవమన్నారు. గతంలో సమస్యలొస్తే ఎన్టీఆర్, నాగేశ్వరరావు వంటి హీరోలు రాలేదని, సమస్యలుంటే ఫిల్మ్ ఛాంబరే పరిష్కరించేదన్నారు.
ప్రస్తుత నిర్మాతల్లో స్థిరత్వం లేదన్నారు. ఈ సందర్భంగా ఆయన ఏపీ ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తిరుమలలో వెయ్యి కాళ్లమండపం తొలగించినప్పుడు చంద్రబాబును విమర్శించారని, ఆగమశాస్త్రం ప్రకారమే చంద్రబాబు వెయ్యికాళ్ల మండపాన్ని తొలగించారన్నారు. ప్రస్తుతం తిరుపతిలో జరుగని పాపం లేదని విమర్శించారు. ప్రభుత్వం మూడేళ్లలో తిరుపతిని సర్వనాశనం చేసిందని మండిపడ్డారు. స్వామి ఇంకా పాపాలను ఎందుకు చూస్తున్నాడో తెలియట్లేదన్నారు.