హైదరాబాద్, సెప్టెంబర్ 29(నమస్తే తెలంగాణ): తెలంగాణ క్యాడర్కు కేటాయించిన 2021 బ్యాచ్ ప్రొబేషనరీ ఐఏఎస్ అధికారులు గురువారం రాజేంద్రనగర్లోని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయాన్ని సందర్శించారు. విత్తనాలు, పలు పంటలపై పరిశోధనల గురించి అడిగి తెలుసుకొన్నారు. అక్కడి పంటలను పరిశీలించారు.
వర్సిటీ ప్రాంగణంలోని అగ్రి ఇన్ఫర్మేషన్ హబ్ను సందర్శించారు. వరి, మొక్కజొన్న పరిశోధనా కేంద్రాల్లోని పరిశోధనల వివరాలను పరిశోధన విభాగం డైరెక్టర్ జగదీశ్వర్ వారికి వివరించారు. దీంతోపాటు క్వాలిటీ కంట్రోల్ ల్యాబ్, పెస్టిసైడ్స్ రెసిడ్యూయల్ ల్యాబ్, మిల్లెట్ ఇంక్యుబేషన్ సెంటర్, అగ్రి హబ్ను కూడా వారు సందర్శించి అక్కడ జరుగుతున్న కార్యక్రమాలను పరిశీలించారు.