లక్నో : యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో నిరుద్యోగం, ధరల మంట, మహిళా సాధికారత, రైతులు, వ్యాపారుల కడగండ్ల వంటి అంశాల నుంచి బీజేపీ, ఎస్పీలు ప్రజల దృష్టి మళ్లిస్తూ ఉగ్రవాదంపై మాట్లాడుతున్నాయని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా బుధవారం ఆరోపించారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల గురించి ఒత్తిడితోనే ఆయా పార్టీలు మాట్లాడటం మొదలుపెట్టాయని దుయ్యబట్టారు. వీధి పశువుల వీరంగంతో యూపీలో రైతాంగం, ప్రజలు ఏండ్లతరబడి బాధపడుతుంటే ప్రధానికి ఈ విషయం ఇప్పుడే తెలిసిందని ప్రియాంక గాంధీ ఎద్దేవా చేశారు. ఉగ్రవాదం గురించి ఉపన్యాసాలు దంచుతూ యూపీ సీఎం యోగి ఆదిత్యానాధ్ బిజీగా ఉన్నారని ధ్వజమెత్తారు. నాలుగో దశ ఎన్నికల సందర్భంగా వీధి పశువుల విషయంలో బాధితులకు యోగిజీ ఇప్పుడు ఎందుకు పరిహారం ప్రకటించారని ఆమె నిలదీశారు.
ఉగ్రవాదంపై ప్రజలకు ఉపన్యాసాలు ఇస్తూ 80, 20 శాతం లాజిక్ను ప్రయోగించినప్పుడు ఆయనకు ఈ విషయం తెలియదా అని ప్రియాంక ప్రశ్నించారు. యూపీలో ఎంత శాతం మంది నిరుద్యోగులున్నారో యోగి వెల్లడించాలని డిమాండ్ చేశారు. ఎస్పీ, బీజేపీలకు అభివృద్ధి పట్ల, ప్రజలపై ప్రభావం చూపే అంశాల పట్ల ఆసక్తి లేదని ఆరోపించారు. ఎలాగైనా అధికార పగ్గాలు చేపట్టాలనేదే ఈ పార్టీల లక్ష్యమని ఎద్దేవా చేశారు. ప్రజలు నిత్యం అభద్రతతో ఆర్ధికంగా బలహీనంగా ఉండాలని వారు కోరుకుంటారని, వారి మనోభావాలతో చెలగాటమాడుతూ నిరంతరం అధికారం చెలాయించాలనేది ఎస్పీ, బీజేపీల ఉద్దేశమని విమర్శించారు. 30 ఏండ్ల తర్వాత కాంగ్రెస్ 400 స్ధానాల్లో పోటీ చేస్తోందని కార్యక్షేత్రంలో కాంగ్రెస్ పోరాడిన తరహాలో ఏ పార్టీ పోరాడలేదని ఆమె పేర్కొన్నారు.
గత రెండేండ్లుగా ప్రజా సమస్యలపై గళం విప్పిన 18,700 మందికి పైగా కాంగ్రెస్ కార్యకర్తలు, కార్యవర్గ సభ్యులను అరెస్ట్ చేశారని చెప్పారు. ఎన్నికల షెడ్యూల్ వెల్లడయ్యేవరకూ ఎస్పీ, బీజేపీలు నిస్తేజంగా, మౌనంగా ఉన్నాయని వ్యాఖ్యానించారు. ఇక ఫిబ్రవరి 10 నుంచి మార్చి 7 వరకూ ఏడు దశల్లో యూపీ అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా మార్చి 10న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు ప్రకటిస్తారు. ఈ ఎన్నికల్లో గెలుపొంది మరోసారి పాలనా పగ్గాలు చేపట్టాలని పాలక బీజేపీ ప్రయత్నిస్తుండగా, యోగి సర్కార్పై వ్యతిరేకతను సొమ్ము చేసుకుని అందలం ఎక్కాలని అఖిలేష్ సారధ్యంలోని ఎస్పీ సర్వశక్తులు ఒడ్డుతోంది. ఇక ప్రధాన పార్టీలకు దీటుగా సత్తా చాటేందుకు బీఎస్పీ, కాంగ్రెస్లు చెమటోడుస్తున్నాయి.