చండీఘఢ్ : పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారాన్ని కాంగ్రెస్ హోరెత్తిస్తోంది. పఠాన్కోట్లో గురువారం జరిగిన ర్యాలీలో ప్రధాని నరేంద్ర మోదీ, ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ లక్ష్యంగా కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ విమర్శలు గుప్పించారు. వారిని బడే మియా, చోటే మియాగా పేర్కొంటూ మోదీ, కేజ్రీవాల్ ఇద్దరూ ఆరెస్సెస్ నుంచి ఎదిగివచ్చిన వారేనన్నారు. గుజరాత్ మోడల్లో మనం చూసింది ఒక్కటేనని, దేశాన్ని ఇద్దరు వ్యక్తులకు వారు అమ్మేశారని మోదీ సర్కార్పై ప్రియాంక గాంధీ విరుచుకుపడ్డారు. ఇక ఢిల్లీ సీఎం, ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ ఘనంగా చెప్పుకునే ఢిల్లీ మోడల్ను ఉద్దేశిస్తూ అక్కడి రోడ్లపై ప్రజలు ఎలా ప్రాణాలు కోల్పోతున్నారో మీరు చూశారా అని ప్రశ్నించారు. పేద కుటుంబ నేపధ్యం కలిగిన సీఎం చరణ్జిత్ సింగ్ చన్నీ పంజాబీల బాగు కోసం సరైన నిర్ణయాలు తీసుకోగలుగుతారని వివరించారు.
111 రోజులుగా పంజాబ్లో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు మేలు చేసే నిర్ణయాలు తీసుకోగలిగిందని సగటు పంజాబ్ ప్రజలకు ప్రాతినిధ్యం వహించేలా చన్నీ పేద కుటుంబం నుంచి రావడమే ఇందుకు కారణమని ఆమె చెప్పుకొచ్చారు. ఇక అంతకుముందు సోమవారం జలంధర్ ర్యాలీలోనూ మోదీ సర్కార్పై ప్రియాంక మండిపడ్డారు. ప్రధాని మోదీ తలపాగా ధరించి పంజాబ్ ర్యాలీల్లో ప్రత్యక్షం కావడాన్ని ఉద్దేశించి ఎవరైనా తలపాగా ధరించగానే సర్ధార్ కాలేరని ప్రియాంక గాంధీ చురకలు వేశారు. వేదికపై నకిలీ తలపాగాతో దర్శనమివ్వగానే ఎవరూ సర్ధార్జీ కారని వారికి చెప్పండని అన్నారు. నిజమైన సర్ధార్ ఎవరో వారికి చెప్పండి. ఈ తలపాగాలో ఎంతటి ధైర్యం, కఠోరశ్రమ దాగుందో వారికి తెలియచెప్పండని ప్రియాంక పేర్కొన్నారు. పంజాబ్ పంజాబీలకు చెందినదని, దాన్ని వారు నడిపించుకుంటారని బీజేపీ, ఆప్లకు చెప్పండని సూచించారు. పంజాబ్లో ఓ పార్టీ గుజరాత్ మోడల్ను ముందుకుతెస్తుండగా మరో పార్టీ ఢిల్లీ మోడల్ అంటూ హడావిడి చేస్తోందని బీజేపీ, ఆప్లపై ప్రియాంక గాంధీ విమర్శలు గుప్పించారు.
గుజరాత్ మోడల్ను మీరు పరిశీలిస్తే ఏ ఒక్కరికి ఉద్యోగాలు అందుబాటులో ఉండవని, వ్యాపారాలు సజావుగా సాగవనీ, ఎలాంటి నిధులూ సమకూరవని తెలుస్తుందని చెప్పారు. ఇక ఢిల్లీ మోడల్లో ఏ ఒక్క ఆస్పత్రి, విద్యాసంస్ధలను కొత్తగా నిర్మించలేదని ప్రియాంక ఎద్దేవా చేశారు. మరోవైపు పంజాబ్ కాంగ్రెస్లో అంతర్గత పోరుకు తెరదించేలా ఆ పార్టీ పలు సంకేతాలు పంపుతోంది. పంజాబ్ రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ తనకు సోదరుడి వంటి వాడని, ప్రతి కార్యకర్త కాంగ్రెస్ పార్టీకి కీలకమని సీఎం చరణ్జిత్ సింగ్ చన్నీ అన్నారు. కాంగ్రెస్లో అంతర్గత పోరు లేదని సిద్ధూ ఇటీవల వ్యాఖ్యానించిన నేపధ్యంలో చన్నీ సైతం ఇవే సంకేతాలు పంపారు. ఇక ఫిబ్రవరి 20న ఒకే దశలో పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా మార్చి 10న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు ప్రకటిస్తారు.