కేవలం హాస్యనటుడిగానే స్థిరపడిపోవడం తన అభిమతం కాదని..ఎప్పటికప్పుడు ఇమేజ్ను బ్రేక్ చేసుకుంటూ భిన్న పాత్రల్లో మెప్పించాలనుకుంటున్నానని చెప్పారు ప్రియదర్శి. తెలుగు చిత్రసీమలో హాస్య నటుడిగా, కథానాయకుడిగా, క్యారెక్టర్ ఆరిస్టుగా తనదైన ముద్రతో దూసుకుపోతున్నారాయన. నవీన్ పొలిశెట్టితో కలిసి ఆయన నటించిన తాజా చిత్రం ‘జాతిరత్నాలు’ ఇటీవలే ప్రేక్షకులముందుకొచ్చింది. ఈ సందర్భంగా ప్రియదర్శి పాత్రికేయులతో సంభాషించారు.
తొలుత రాహుల్ రామకృష్ణ నాకు ఈ కథ చెప్పాడు. వింటూనే పడిపడి నవ్వాను. ‘ఇలాంటి కథలు నా దగ్గరకు ఎందుకు రావు’ అనిపించింది. ఆ తర్వాత నేను కూడా ఈ ప్రాజెక్ట్లో భాగమయ్యాను. దర్శకుడు అనుదీప్ కథ చెబుతుంటే ఆసాంతం ఎంజాయ్ చేశా. ఈ సినిమాలో ఉండే జోక్స్, పంచ్ సంభాషణలు సాధారణంగా స్నేహితుల మధ్యలో వచ్చేవే. ఇలాంటి సిల్లీ కామెడీ ప్రేక్షకులకు నచ్చుతుందో లేదో అని తొలుత కొంచెం భయమేసింది. షూటింగ్కు ముందు నేను, నవీన్, రాహుల్రామకృష్ణ కలిసి వర్క్షాప్ చేశాం. సినిమా పూర్తయ్యాక సన్నివేశాల్ని చూస్తూ మనస్ఫూర్తిగా నవ్వుకున్నాం. మేము అనుకున్న విధంగానే ప్రేక్షకులు చిత్రానికి అద్భుత ఆదరణ కనబరుస్తున్నారు.
దర్శకుడి విజన్కు అనుగుణంగా..
‘జాతిరత్నాలు’ సినిమా ద్వారా నటుడిగా నన్ను నేను కొత్తగా ఆవిష్కరించుకున్నా. కథ, దర్శకుడిని నమ్మి సినిమాలు చేయడమే విధిగా భావిస్తా. విలన్గా ప్రయాణాన్ని ప్రారంభించిన నేను ఈ స్థాయికి రావడానికి నాకోసం మంచి పాత్రలు సృష్టించిన దర్శకులు, రచయితలే కారణమనుకుంటున్నా.
వినోదంలో కొత్తదనం ఉండాలి
కామెడీ పండించడం అంత సులభం కాదు. ప్రతిసారి వ్యంగ్యం, వెటకారం కలబోసిన వినోదంతోనే రాణించలేం. వినోదంలో కూడా కొత్తదనం ఉన్నప్పుడే ప్రేక్షకులు ఆదరిస్తారు. అందుకే విభిన్న కథాంశాల్ని ఎంచుకుంటూ కెరీర్ను కొనసాగిస్తున్నా. ఎస్వీ రంగారావు, కోట శ్రీనివాసరావు, ప్రకాష్రాజ్గార్ల ప్రభావం నాపై చాలా ఉంది.
నిత్యం ప్రవహించాలి
స్వతహాగా నాకు రాజకీయ నేపథ్య చిత్రాలంటే ఇష్టం. అలాంటి కథల్లో నటించాలని ఉంది. నటుడిగా ఒక్కచోటే ఆగిపోకుండా నిత్యం ప్రవహిస్తూ సాగిపోవాలన్నదే నా తత్వం. ప్రస్తుతం ‘ఆహా’లో ఓ వెబ్సిరీస్ చేస్తున్నా. ‘మెయిల్’కు సీక్వెల్ చేసే ఆలోచన ఉంది. దర్శకత్వం గురించి ప్రస్తుతానికైతే ఎలాంటి ఆలోచన లేదు.