హైదరాబాద్ : ప్రైవేటు విద్యా సంస్థల్లోలోని బోధనా సిబ్బందికి ఉద్యోగ భద్రత ఉండాలి. ఈ మేరకు పార్లమెంట్లో చట్టాన్ని తీసుకుని రావాల్సిన అవసరం ఎంతైనా ఉందని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ అభిప్రాయ పడ్డారు.
ప్రైవేటు రంగంలోని స్కూల్స్, ఇంటర్, డిగ్రీ, పీజీ కాలేజీలలోని బోధనా సిబ్బంది అభత్రతా భావంతో విధులు నిర్వహిస్తున్నారని వినోద్ కుమార్ పేర్కొన్నారు.
ఈ పరిస్థితులు మారాలంటే ప్రైవేటు విద్యా రంగంలోని బోధనా సిబ్బందికి ఉద్యోగ భద్రతా కల్పించేందుకు పార్లమెంటులో ప్రత్యేకంగా చట్టాన్ని తీసుకుని రావాలని వినోద్ కుమార్ స్పష్టం చేశారు.
చట్టంతో పాటు టీచింగ్ సెస్ ను సేకరించాలని, ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు ఈ సెస్ నుంచి నిధులను సంబంధిత బోధనా సిబ్బంది కుటుంబ సభ్యులకు ఆదుకునేందుకు వీలు కలుగుతుందని వినోద్ పేర్కొన్నారు.
ఇదే తరహా విధానం బిల్డింగ్ నిర్మాణ రంగంలో అమలు అవుతోందని ఆయన గుర్తు చేశారు.
ప్రైవేటు విద్యా రంగంలో పని చేస్తున్న వేలాది మంది బోధనా సిబ్బందికి ఈ చట్టం ద్వారా మేలు జరుగుతుందని వినోద్ కుమార్ అన్నారు.
పార్లమెంటులో ఈ చట్టాన్ని తీసుకుని వచ్చేందుకు అధికార, విపక్షాలు కృషి చేయాలన్నారు.
ఇదే విషయాన్ని గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో జరిగిన పలు సమావేశాలలో ప్రస్తావించినట్లు ఆయన తెలిపారు.