సంగారెడ్డి : రిమాండ్లో ఉన్న ఓ ఖైదీ కాలకృత్యాలు తీసుకుంటానని చెప్పి పోలీసుల కళ్లు కప్పి పరారయ్యాడు. పరారైనా ఆ ఖైదీని సంగారెడ్డి పట్టణ పోలీసులు గంట వ్యవధిలోనే పట్టుకున్నారు. ఈ సంఘటన శుక్రవారం సంగారెడ్డి జిల్లా కేంద్రం కొత్త బస్టాండ్ ఆవరణలో చోటు చేసుకుంది. ప్రస్తుతం చెర్లపల్లిలో పలు కేసుల్లో దోషీగా ఉండి శిక్ష అనుభవిస్తున్న నరేశ్ అనే రిమాండ్ ఖైదీని ముగ్గురు ఏఆర్ కానిస్టేబుళ్లు కేసు విచారణ నిమిత్తం సంగారెడ్డి జిల్లా కోర్టుకు శుక్రవారం ఉదయం తీసుకొచ్చారు.
సదరు ఖైదీని కోర్టును తీసుకుపోతున్న తరుణంలో ఖైదీ అయిన నరేశ్ కాలకృత్యాలు తీసుకుంటాని చెప్పి పోలీసుల కళ్లుగప్పి అక్కడి నుంచి పారిపోయాడు. వెంటనే తేరుకున్న పోలీసులు స్థానిక పట్టణ పోలీసు సిబ్బంది సమాచారం చేరవేశారు. రంగంలోకి దిగిన సంగారెడ్డి పట్టణ పోలీసులు గంట వ్యవధిలో రక్షక్ వాహనం ద్వారా గాలించి అతడిని పట్టుకున్నారు. పట్టుకున్న ఖైదీని తిరిగి చెర్లపల్లి జైలుకు చెందిన సిబ్బందికి అప్పజెప్పారు. ఖైదీ చాకచక్యంగా పట్టుకోవడంలో కృషి చేసిన కానిస్టేబుళ్లు శంకరయ్య, సుదర్శన్, సాయిలు, నాగేశ్వర్రావు, సతీష్కుమార్లను సంగారెడ్డి పట్టణ సీఐ రమేశ్ అభినందించారు.