లండన్ : బ్రిటిష్ రాజకుటుంబంపై ఆ ఇంటి కోడలు, ప్రిన్స్ హ్యారీ భార్య మేఘన్ మార్కెల్ చేసిన జాత్యహంకార వాదనలపై రాజకుటుంబానికి సమర్థనగా ప్రిన్స్ విలియం నిలిచారు. ఆమె చేసిన ఆరోపణలు అసంబద్ధమైనవిగా పేర్కొన్నారు. రాజకుటుంబం ఎంతమాత్రమూ జాత్యహంకార కుటుంబం కాదన్నారు. గురువారం తూర్పు లండన్లోని ఒక పాఠశాలను సందర్శించిన సమయంలో తన సోదరుడు హ్యారీ, మరదలు మేఘన్ మార్కెల్.. ఓప్రా విన్ఫ్రేకు ఇచ్చిన ఇంటర్వ్యూను నేరుగా ప్రస్తావించారు.
బకింగ్హామ్ ప్యాలెస్ తమ 61 పదాల ప్రకటనలో హ్యారీ, మేఘన్ జాత్యహంకారం, దుర్వినియోగం ఆరోపణలపై స్పందించాలని కోరింది. కానీ ఈ వివాదాన్ని అరికట్టడంలో విఫలమైంది.
తండ్రి ప్రిన్స్ చార్లెస్ తర్వాత రాజకుటుంబంలో రెండవ స్థానంలో ఉన్న ప్రిన్స్ విలియం.. ఓప్రా విన్ఫ్రే ఇంటర్వ్యూ తరువాత తమ్ముడు హ్యారీతో ఇంకా మాట్లాడలేదని, తప్పకుండా అతడితో మాట్లాడుతా అని చెప్పారు.
హ్యారీ, మేఘన్ వ్యాఖ్యలు రాజకుటుంబాన్ని కదిలించాయి. జాత్యహంకారం, మానసిక ఆరోగ్యం, బ్రిటన్, దాని పూర్వ కాలనీల మధ్య సంబంధం గురించిన సంభాషణలు ప్రపంచవ్యాప్తంగా మిన్నంటాయి.
రాయల్ కుటుంబం ఎలా స్పందిస్తుందోనని ప్రజలు ఎదురుచూస్తున్నప్పుడే ఆ ఉద్రిక్తతలు మరింతగా పెరిగాయి. బ్రిటిష్ రాజకుటుంబంలోకి వచ్చిన తొలినాళ్లలో చాలా ఒంటరిగా ఫీలయ్యానని, అవమానాలకు కూడా గురయ్యానని మేఘన్ ఇంటర్వ్యూలో ఆరోపించారు. ఒకసారి ఆత్మహత్య చేసుకోవాలన్న ఆలోచనలు కూడా వచ్చాయని చెప్పి ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురిచేశారు. తన కుమారుడు ఆర్చీ కడుపులో ఉన్న సమయంలో శిశువు చర్మం రంగు గురించి రాజకుటుంబం సభ్యులు ఆందోళనతో కూడా సంభాషనలు చేశారని హ్యారీ తనతో చెప్పినట్లు మార్కెల్ చెప్పి యావత్ ప్రపంచాన్ని నిర్ఘాంతపోయేలా చేసింది.