థాణె, ఆగస్టు 28: విపరీతంగా పెరిగిన ధరల కారణంగా ఈ ఏడాది గణేశ్ ఉత్సవాలను నిర్వహించలేకపోతున్నామని మహారాష్ట్రలోని భివండీకి చెందిన ‘డ్రీమ్ కాంప్లెక్స్ గణేశ్ ఉత్సవ్ మండల్’ తెలిపింది. ఈ మేరకు పోలీసులకు ఓ లేఖ రాసింది. ‘గణేశ్ పూజకు ఉపయోగించే పాలు, పెరుగు, నెయ్యి, పండ్లు, పూలు ఇలా అన్ని వస్తువుల ధరలు విపరీతంగా పెరిగాయి. అలాగే ధరల పెరుగుదల కారణంగా విరాళాలు కూడా అందడం లేదు. ఈ నేపథ్యంలో ఈసారి ఉత్సవాలను నిర్వహించడం లేదు’ అని ఆ లేఖలో పేర్కొంది. పెట్రోల్, డీజిల్ ధరల్లో పెరుగుదల కూడా విగ్రహాల తయారీ, తరలింపుపై ప్రభావం చూపుతున్నదని వెల్లడించింది.