బీజింగ్: చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్ మాస్క్ లేకుండా కనిపించారు. సిచువాన్ ప్రావిన్సు పర్యటనలో ఆయన గ్రామస్థులతో మాట్లాడారు. అధికారులు కూడా మాస్క్ ధరించకుండానే అధ్యక్షుడితో సంభాషించారు. కానీ మరో వైపు షాంఘైలో మాత్రం కఠిన కోవిడ్ ఆంక్షలను అమలు చేస్తున్న విషయం తెలిసిందే. బుధవారం సిచువాన్లోని మీషాన్లో జిన్పింగ్ పర్యటించారు. గ్రామంలో తనిఖీలు చేస్తున్న సమయంలో ఆయన మాస్క్ ధరించలేదు. సర్కిల్గా మారిన జనం మధ్యలో నిలబడి జిన్పింగ్ వారితో మాట్లాడారు. స్థిరమైన, ఆరోగ్యమైన ఆర్థిక వాతావరణాన్ని ఏర్పాటు చేసేందుకు అన్ని శాఖలు కలిసి పనిచేయాలని ఆయన అన్నారు. ఇటీవల కఠినమైన కోవిడ్ ఆంక్షల వల్ల అధ్యక్షుడు జిన్పింగ్పై కొంత వ్యతిరేకత వచ్చింది. అయితే అధ్యక్షుడిగా మూడవ సారి కూడా పోటీలో నిలిచేందుకు జిన్పింగ్ ఆసక్తిగా ఉన్న విషయం తెలిసిందే.