హైదరాబాద్, అక్టోబర్ 13 (నమస్తే తెలంగాణ): తెలంగాణ హైకోర్టుకు కొత్తగా ఏడుగురు జడ్జీల నియామకానికి రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ బుధవారం ఆమోదముద్ర వేశారు. కేంద్ర న్యాయశాఖ గెజిట్ నోటిఫికేషన్ను వెలువరించింది. సీనియర్ జిల్లా జడ్జీలు పెరుగు శ్రీసుధ, డాక్టర్ చిల్లకూరు సుమలత, డాక్టర్ గురిజాల రాధారాణి, మున్నారి లక్ష్మణ్, నూన్సావత్ తుకారాంజీ, అద్దుల వెంకటేశ్వర్రెడ్డి హైకోర్టు న్యాయమూర్తులు కాబోతున్నారు. జుడీషియల్ మెంబర్, ఆదాయం పన్ను శాఖ అప్పిలేట్ ట్రిబ్యునల్ అథారిటీ (ఐటీఏటీ) సభ్యురాలు పట్లోళ్ల మాధవీదేవి కూడా న్యాయమూర్తి కానున్నారు. ప్రస్తుతం హైకోర్టుకు దసరా సెలవులు ఉన్నందున.. కోర్టు ఫునఃప్రారంభమయ్యే 18వ తేదీన కొత్త న్యాయమూర్తులు ప్రమాణం చేసే అవకాశం ఉన్నది. వీరితో హైకోర్టు సీజే జస్టిస్ సతీశ్చంద్రశర్మ ప్రమాణం చేయించేందుకు గవర్నర్ తమిళిసై సౌందర్రాజన్ అనుమతి ఇవ్వనున్నారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత న్యాయాధికారులకు హైకోర్టు జడ్జీలుగా పదోన్నతి లభించడం ఇదే తొలిసారి. కొలీజియం ఆమోదించిన ఏడుగురు న్యాయమూర్తుల్లో నలుగురు మహిళలు ఉండటం గమనార్హం. వీరిలో ముగ్గురు సీనియార్టీ ప్రకారం తొలి మూడుస్థానాల్లో ఉన్నారు.
హైకోర్టులో 17కి చేరనున్న న్యాయమూర్తులు
జుడీషియల్ సర్వీసెస్కు చెందిన ఏడుగురిని హైకోర్టు న్యాయమూర్తుగా నియమించాలని హైకోర్టు చేసిన సిఫారసులను సుప్రీంకోర్టు కొలీజియం ఆమోదించింది. ఈ ఏడాది ఆగస్టు 17న కేంద్రానికి సిఫారసు చేసింది. కేంద్రం ఇటీవల సమ్మతి తెలియజేసి రాష్ట్రపతికి నివేదించగా.. ఆయన ఆమోద ముద్రవేశారు. తాజాగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఎన్వీ రమణ బాధ్యతలు చేపట్టాక తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తుల సంఖ్యను 42కి పెంచుతూ కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం 11 మంది (సీజే జస్టిస్ ఎస్సీ శర్మతో కలిపి) న్యాయమూర్తులు ఉన్నారు. వీరిలో జస్టిస్ టీ అమర్నాథ్గౌడ్ త్రిపుర హైకోర్టుకు బదిలీ అయ్యారు. ఆయనకు హైకోర్టు వీడోలు చెప్తే.. కొత్తగా ఏడుగురు ప్రమాణం చేస్తే న్యాయమూర్తుల సంఖ్య 17కి పెరుగుతుంది. మొత్తం 42 పోస్టుల్లో ఇంకా 25 న్యాయమూర్తుల పోస్టులు ఖాళీగా ఉంటాయి. బార్ నుంచి న్యాయవాదులను న్యాయమూర్తులుగా చేసే ప్రక్రియ మిగిలి ఉన్నది.