న్యూఢిల్లీ : మధ్యప్రదేశ్లోని గ్వాలియర్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రయాణికులు మృతిచెందడం పట్ల రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు. మరణించిన ప్రయాణికుల్లో చాలామంది మహిళలుండటంపై విచారం వ్యక్తం చేశారు.
మృతుల కుటుంబాలకు భగవంతుడు మనోధైర్యం ప్రసాదించాలని రాష్ట్రపతి కోవింద్ ట్విట్ చేశారు. మంగళవారం ఉదయం గ్వాలియర్లో ప్రయాణికులతో వెళ్తున్నఆటోను.. బస్సు ఢీకొట్టడంతో 13 మంది మృతి చెందారు.
వీరిలో 12 మంది మహిళలే. మహిళలు అంగన్వాడీ కేంద్రంలో వంట చేసేందుకు వెళ్లి ఇంటికి వస్తుండగా.. ఈ ప్రమాదం సంభవించిందని గ్వాలియర్ ఎస్పీ అమిత్ సంఘీ తెలిపారు.