Vegetable nuresery | ప్రస్తుతం తాజా కూరగాయలకే అందరూ మొగ్గు చూపుతున్నారు. ఇంటి ముందు గానీ, వెనకాలగానీ, ఇంటి దాబాపై గానీ కూరగాయల్ని పెంచడం ద్వారా తాజా సమస్యను పరిష్కరించుకోవచ్చు. మనమే పెంచుకున్నాం అనే ఆనందాన్ని కూడా సొంతం చేసుకుంటాం. దాంతో చాలా మంది ఇంట్లో కూరగాయలను పెంచుకోవడానికి మక్కువ చూపుతున్నారు. ఇంటికి సరిపోయేంత కూరగాయల్ని పెంచుకుంటూ ఆరోగ్యంతో పాటు కాలక్షేపం కూడా పొందుతున్నారు.
కొందరికి అనువైన స్థలం లేకపోవడం వల్ల పూల తొట్టెల్లో పెంచుతున్నారు. పట్టణాల్లో కుండీల్లో పెంచుతూ పశువుల ఎరువులు దొరకని కారణంగా ఇబ్బంది పడుతున్నారు. కూరగాయల సాగులో నర్సరీ దశ ఎంతో ముఖ్యమైనది. ఆరు బయట సాగు చేసే నారుమడులను ప్రత్యేకమైన ఎత్తు నారు మడుల్లో లేదా నారు నర్సరీ ట్రేలలో తయారు చేసుకోవాలి. కుండీల్లో పెంచుకునేవారు తోట మట్టిని ఉపయోగించాలి. కుండీల్లో నీటి నిల్ల లేకుండా చూసుకోవాలి. ఎక్కువ నీరు పోయేందుకు వీలుగా కుండీలకు రంధ్రాలు చేయాలి. మొక్కలకు కావాల్సిన సూర్యరశ్మి అందేలా చూడాలి.
ఇంట్లో ఆకుకూరలు పెంచుకోవడానికి 6 అంగుళాల కన్నా లోతు మట్టి అవసరం ఉండదు. వెడల్పు ఎక్కువగా, ఎత్తు తక్కువగా ఉండేలా చూడాలి. కుండీలు, మడుల్లో ముందుగా ఎర్రమట్టి, చివికిన పశువుల ఎరువు లేదా వర్మికంపోస్ట్ సమపాళ్లలో కలిపి మిశ్రమాన్ని వేసుకోవాలి. కొబ్బరిపొట్టు, వేపపిండి కలుపుకోవాలి. తీగ జాతి కూరగాయలు చిక్కుడు, బెండ, గోరు చిక్కుడు, మునగ వంటి వాటిని నేరుగా విత్తుకోవచ్చు. విత్తన పరిమాణం చిన్నగా ఉండే టమాట, వంకాయ, క్యాబేజీ, క్యాలిఫ్లవర్, మిరప, ఉల్లీ వంటి పంటల్లో ముందుగా నారుమడుల్లో పెంచుకొని ఆ తర్వాత వేరే ప్రాంతంలో నాటుకోవాలి.
నారుమడుల పెంపకం
నారు మాడులు పెంచే స్థలం గాలి, వెలుతురు ఎక్కువగా ఉండి నీటి వసతికి దగ్గరగా ఉండాలి. నేలను 3-4 సార్లు బాగా దుక్కి దున్నీ మంచిగా చదును చేయాలి. 4 మీ. లి. పొడవు 1 మీ. వెడల్పు 15 సేం. మీ ఎత్తు గల మడులను తయారు చేసుకోవాలి. ఈ మడులను తెల్లటి పాలిథిన్ కాగితంలో కప్పి రెండు వారల వరకు సూర్యరశ్మి ద్వారా అధిక ఎండ వేడికి సరి చేయుట వలన నేలలోని శిలీంద్రాలు చాలా వరకు చనిపోతాయి.
తెగులు రాకుండా..
విత్తనాన్ని చాలా పలుచగా విత్తుకోవడం వలన ఆరోగ్యంగా పెరుగుతాయి. దగ్గరగా గుంపులుగా పెరిగే వాటికి కుళ్ళు తెగులు వచ్చే అవకాశం ఉంటుంది. విత్తనాలు మొలకెత్తే వరకు రోజూ నీటి తడులు ఇవ్వాలి. నారుమడులను శుభ్రమైన ఎండు గడ్డితో కప్పాలి. విత్తనం మొలకెత్తనట్లు కనపడగానే పైన కప్పిన గడ్డిని తీసి వేయాలి. ఒక వరుసలో 60-65 మొక్కలు ఉండేలా చూసుకోవాలి.
కలుపుతీయడం..
నారుమడుల్లో కలుపును వెంటవెంటనే చేపట్టాలి. రసం పీల్చు పురుగులు, ఆకు మచ్చ తెగుల నివారణకు మాలధియన్ లేదా డైమీతోయేట్ 2 మీ. లి. కలిపి పిచికారీ చేయాలి. నారు కుళ్ళు తెగులు కనిపించగానే కాపర్ ఆక్సిక్లోరైడ్ 3 గ్రా. లీటర్ నీటికి కలిపి మొక్క తడిచేలా పిచికారీ చేయాలి. నారు త్వరగా పెరుగడానికి నత్రజని అధికంగా ఇవ్వొద్దు. నీటి తడులు కూడా తగ్గించాలి. నారు పీకడానికి వారం ముందు నీటి తడులు ఆపి నారు మొక్కలు గట్టిపడేలా చూడాలి. ప్రధాన పొలంలో చీడపిడలు ఆశించే ముందు డైమీథోయేట్ పిచికారీ చేసి ప్రధాన పొలంలో నాటుకోవాలి.