హైదరాబాద్ : రాష్ట్రంలో ఇవాళ ఆల్టైమ్ విద్యుత్ డిమాండ్ నెలకొంది. 13,688 మెగావాట్ల పీక్ డిమాండ్ను విద్యుత్ సంస్థలు అధిగమించాయి. దీనిపై ట్రాన్స్కో, జెన్కో సీఎండీ ప్రభాకర్రావు స్పందిస్తూ.. ఎలాంటి ఇబ్బందులు లేకుండా విద్యుత్ సరఫరా చేసినట్లు తెలిపారు. భవిష్యత్లో డిమాండ్ పెరిగినా విద్యుత్ సరఫరా చేసేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. గత ఏడాది ఫిబ్రవరిలో 13,168 మెగావాట్ల డిమాండ్ రాగా ఈ ఏడాది అంతకంటే ఎక్కువ డిమాండ్ పెరిగిందన్నారు.
ఏ రాష్ట్రంలో లేనివిధంగా 5 వేల మెగావాట్ల విద్యుత్ను వ్యవసాయ రంగానికి సరఫరా చేస్తున్నట్లు తెలిపారు. ఎంత డిమాండ్ వచ్చిన అన్ని వర్గాలకు నాణ్యమైన విద్యుత్ను సరఫరా చేస్తున్నట్లు చెప్పారు. సీఎం కేసీఆర్ ముందుచూపుతో విద్యుత్ డిమాండ్ అధికంగా ఉన్నా వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ సరఫరా చేస్తున్నట్లు వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా విద్యుత్ సరఫరాకు ఎటువంటి అంతరాయం లేదన్నారు. విద్యుత్ డిమాండ్పై సీఎం కేసీఆర్ ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్నారన్నారు.
టీఎస్ఎస్పీడీసీఎల్ సీఎండీ రఘుమారెడ్డి మాట్లాడుతూ.. గత ఏడాది జీహెచ్ఎంసీలో 1700 మెగావాట్ల విద్యుత్ డిమాండ్ ఉండేదన్నారు. కానీ అది ఇప్పుడు 2,760 మెగావాట్ల డిమాండ్కు పెరిగిందన్నారు. 3 వేల మెగావాట్ల డిమాండ్ వచ్చినా సరఫరా చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. వ్యవసాయరంగానికి విద్యుత్ వినియోగం బాగా పెరిగిందని ఆయన పేర్కొన్నారు.