గువాహతి: గర్భం దాల్చిన మహిళ ప్రసవానికి మూడున్నర నెలల గడువు ఉండగానే ఒక డాక్టర్ నిర్లక్ష్యంగా సిజేరియన్ ఆపరేషన్ నిర్వహించాడు. అయితే పిండం పూర్తిగా పెరుగలేదని తెలిసి గర్భిణీకి తిరిగి కుట్లు వేశాడు. అస్సాంలోని కరీంగంజ్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. ఐదున్నర నెలల గర్భవతి అనారోగ్యం వల్ల కరీంగంజ్లోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఆగస్ట్ 21న చేరింది. రెండు రోజులు పరిశీలనలో ఉంచిన గైనిక్ డాక్టర్ అల్ట్రాసౌండ్ స్కానింగ్ పరీక్ష నిర్వహించకుండానే ఆగస్ట్ 23న ఆమెకు సిజేరియన్ ఆపరేషన్ చేశాడు. అయితే పిండం పూర్తిగా ఎదుగలేదని తెలుసుకుని నాలుక కరుచుకున్నాడు. పొరపాటును కప్పిపుచ్చుకునేందుకు తిరిగి కుట్లు వేశాడు. ఈ విషయం ఎవరికీ చెప్పవద్దని ఆ మహిళ కుటుంబానికి చెప్పాడు. అనంతరం ఆగస్ట్ 31న ఆ గర్భిణీని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు.
కాగా, ఇంటికి వెళ్లిన తర్వాత ఆ మహిళ ఆరోగ్యం క్షిణించింది. దీంతో డెలివరీ తేదీకి మూడున్నర నెలలకు ముందే సిజేరియన్ ఆపరేషన్ చేసిన విషయం ఆమె బంధువులు, ఇరుగుపొరుగువారికి తెలిసింది. ఈ నేపథ్యంలో కుటుంబ సభ్యులు ఈ విషయాన్ని ఆసుపత్రి అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో దీనిపై దర్యాప్తు కోసం 11 మంది సభ్యులతో కమిటీ వేశారు. ప్రాథమిక నివేదికను శుక్రవారం విడుదల చేశారు. ఉన్నతాధికారుల ఆదేశాలతో ఆ డాక్టర్తోపాటు బాధ్యులపై చర్యలు తీసుకుంటామని ఆసుపత్రి అధికారులు తెలిపారు.
మరోవైపు ఆరోగ్యం క్షీణించిన గర్భిణీని తిరిగి ఆసుపత్రిలో అడ్మిట్ చేశారు. అల్ట్రాసౌండ్ స్కానింగ్ పరీక్ష నిర్వహించగా గర్భంలోని పిండం ఆరోగ్యంగా ఉన్నట్లు గుర్తించారు. సిజేరియన్ ఆపరేషన్ వల్ల ఆ పిండానికి ఎలాంటి హానీ జరుగలేదని ఆసుపత్రి వైద్యులు తెలిపారు.