‘లాక్డౌన్ తర్వాత తెలుగులో విడుదలవుతున్న భారీ బడ్జెట్ సినిమా ఇదే. రానున్న రోజుల్లో అగ్ర చిత్రాల భవితవ్యం ఎలా ఉండబోతుందనే ఈ సినిమా ఫలితంపైనే ఆధారపడి ఉంది’ అని అన్నారు మిర్యాల రవీందర్రెడ్డి. ద్వారకా క్రియేషన్స్ పతాకంపై ఆయన నిర్మించిన తాజా చిత్రం ‘అఖండ’. బాలకృష్ణ హీరోగా నటించారు. బోయపాటి శ్రీను దర్శకుడు. డిసెంబర్ 2న ప్రేక్షకుల ముందుకురానుంది. బుధవారం హైదరాబాద్లో మిర్యాల రవీందర్రెడ్డి పాత్రికేయులతో ముచ్చటించారు. ఆ
విశేషాలివి…
ఈ సినిమా కోసం బాలకృష్ణతో సాగించిన ప్రయాణాన్ని మాటల్లో వర్ణించలేను.బాలకృష్ణ గురించి బయట చాలా వరకు అవాస్తవాలే ప్రచారంలో ఉన్నాయి. వ్యక్తిగతంగా కలిసినప్పుడే ఆయన గొప్పతనం ఏమిటో అర్థమవుతుంది. విజువల్ వండర్గా దర్శకుడు బోయపాటి శ్రీను ఈ సినిమాను రూపొందించారు. ఇలాంటి సినిమాను బిగ్స్క్రీన్పై చూస్తేనే ఆ ఎక్స్పీరియన్స్ను ఎంజాయ్చేస్తారు. థియేటర్స్ వ్యవస్థకు ఈ సినిమా పూర్వ వైభవం తీసుకొస్తుందనే నమ్మకముంది. తొలుత డిసెంబర్ 24న సినిమాను విడుదలచేయాలని అనుకున్నాం. డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్తో మాట్లాడిన తర్వాతే డిసెంబర్ 2ను సరైన తేదీగా నమ్మి ప్రేక్షకుల ముందుకొస్తున్నాం.
‘మహార్జాతకుడు’ టైటిల్తో..
ఏ సినిమాకైనా కథే ముఖ్యం. ఆ తర్వాతే హీరోలు, దర్శకులకు విలువ ఉంటుంది. కానీ స్టార్స్ సినిమాలకు అలాంటి పరిమితులు ఉండవు. ఎంత చిన్న కథనైనా స్టార్స్ తమ ఇమేజ్తో నిలబెట్టగలరు. బాలకృష్ణ వందో సినిమా కోసం 2014లో ‘మహార్జాతకుడు’ పేరుతో బోయపాటి శ్రీను ఈ కథను సిద్ధంచేశారు. ఇద్దరి కమిట్మెంట్స్ కారణంగా ఆ సమయంలో సినిమా చేయడం కుదరలేదు. బోయపాటి చెప్పిన కథ నచ్చడంతో 2019లో సినిమాను ప్రారంభించాం. బాలకృష్ణ పాత్ర రెండు కోణాల్లో సాగుతుంది. దైవాంశసంభూతుడైన అఘోరాగా ఓ క్యారెక్టర్ శక్తివంతంగా ఉంటుంది. తనకు ఎదురైన సమస్యను అతడు ఎలా పరిష్కరించడన్నది ఆకట్టుకుంటుంది. టికెట్ రేట్ల విషయంలో కొన్ని ఇబ్బందులు ఉన్నా ఏపీ ప్రభుత్వం తీసుకునే నిర్ణయాన్ని అందరూ గౌరవించాల్సిందే. కరోనా వల్ల మేము అనుకున్నదానికంటే బడ్జెట్ పెరిగింది. ప్రస్తుతం ఏపీలో ఉన్న థియేటర్ల సమస్యల వల్ల ఏ మేరకు లాభాలు వస్తాయో అంచనా వేయలేని పరిస్థితి నెలకొంది.