ఒకసారి కొందరు బ్రహ్మసమాజం సభ్యులు రామకృష్ణ పరమహంస వద్దకు వస్తారు. ‘విగ్రహ ఆరాధన ఆచారమా? అపచారమా?’ అన్న చర్చ పెడతారు. ‘భగవంతుడిని సాకారంగా పూజించాలా? నిరాకారంగా భావించి ధ్యానం చేస్తే సరిపోతుంది కదా!’ అని వాదిస్తారు. అప్పుడు ఆ పరమహంస ‘విలువిద్య నేర్చుకునేప్పుడు బాణాన్ని మొదట అరటిచెట్టు వైపు గురిపెట్టాలి. పిదప కాడ వైపు, ఆ తరువాత దీపశిఖవైపు గురిపెట్టాలి. ఆ తరువాత ఎగురుతూ ఉన్న పక్షికేసి గురి చూడాలి. అందుకే మనసును మొదట సాకార రూపంలో సుస్థిరం చేసుకోవాలి. మనసు కుదిరాక, నిరాకారంగా ధ్యానించవచ్చు’ అని ప్రాకృతికమైన ఉదాహరణతో వివరించారు.