తెలుగు బుల్లితెరపై మిస్టర్ పర్ఫెక్ట్ ఇమేజ్ సంపాదించుకున్న యాంకర్ ప్రదీప్.. అనుకోకుండా అప్పుడప్పుడు వివాదాల బారిన కూడా పడుతుంటాడు. ఇక తాజాగా మరో కాంట్రవర్సి ఆయన మెడకు చుట్టుకుంది. ఈ మధ్య జరిగిన ఒక షో లో ఆంధ్రప్రదేశ్ రాజధాని విశాఖ అంటూ నోరు జారాడు ప్రదీప్. దాంతో ఈయన వివాదంలో ఇరుక్కుపోయాడు. ప్రదీప్ చేసిన వ్యాఖ్యలను అమరావతి రైతులతో పాటు ఏపీ పరిరక్షణ సమితి కూడా తీవ్ర స్థాయిలో ఖండించింది. వెంటనే బయటికి వచ్చి క్షమాపణ చెప్పకపోతే ప్రదీప్ ఇంటికి ముట్టడిస్తాం అంటూ ఏపీ పరిరక్షణ సమితి కన్వీనర్ కొలికపూడి శ్రీనివాసరావు వార్నింగ్ ఇచ్చాడు. దాంతో పాటు రైతులు కూడా సీరియస్ అయ్యారు.
వాళ్ల మనోభావాలు దెబ్బతీసేలా ప్రదీప్ వ్యాఖ్యలు ఉన్నాయంటూ వాళ్లు మండిపడ్డారు. దీనిపై వెంటనే క్షమాపణ చెప్పాడు యాంకర్ ప్రదీప్. అందులో ఎవరినీ కించపరచడానికి కానీ, అవమానించడానికి కానీ తాను ప్రయత్నించలేదని.. అసలు అది తన ఉద్దేశం కాదు అంటూ వీడియో విడుదల చేశాడు. అనుకోకుండా జరిగింది కానీ ఉద్దేశపూర్వకంగా చేయలేదంటూ స్పష్టం చేశాడు. తన లక్ష్యం ప్రేక్షకులకు వినోదం అందించడమే కానీ వాళ్లను అవమానపరచడం, మనోభావాలు దెబ్బ తీయడం కాదని యాంకర్ ప్రదీప్ మనస్ఫూర్తిగా క్షమాపణలు చెప్పాడు.
తన వల్ల జరిగిన తప్పుకు తానే క్షమాపణలు చెబుతూ వీడియో విడుదల చేశాడు. ఈ మధ్య జబర్దస్త్ కామెడీ హైపర్ ఆది కూడా వివాదంలో ఇరుక్కున్నాడు. ఒక ఛానల్లో ప్రసారమైన శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమంలో తెలంగాణ బతుకమ్మ, గౌరమ్మను ఆయన అవమానించాడు అంటూ తెలంగాణ జాగృతి ఫెడరేషన్ సభ్యులు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. దాంతో ఆది కూడా బయటికి వచ్చి క్షమాపణ కోరాడు. ఏదేమైనా బుల్లితెర ప్రముఖులు ఏదైనా మాట్లాడే ముందు కచ్చితంగా ఆలోచించాల్సిందే. లేదంటే దానికి భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది.