హైదరాబాద్ : కరెంటు కష్టాలకు చరమగీతం పాడిన రాష్ట్రంగా తెలంగాణ చరిత్రకెక్కిందని సీఎం కేసీఆర్ అన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం విద్యుత్ వ్యవస్థను బలోపేతం చేసిందని, నేడు దేశంలో 24 గంటలూ అన్ని రంగాలకు నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేస్తున్న.. రైతులందరికీ ఉచిత కరెంటు అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అన్నారు. తెలంగాణ ఏర్పడిన నాడు మన రాష్ట్రంలో విద్యుత్ సామర్థ్యం 7,788 మెగావాట్స్ ఉండగా.. ప్రభుత్వం కృషి ఫలితంగా నేడు 16,425 మెగావాట్లకు పెరిగిందన్నారు. తెలంగాణ ఏర్పాటైన సమయంలో ప్రభుత్వ పరిధిలో కేవలం 71 మెగావాట్ల సోలార్ విద్యుత్తు మాత్రమే అయ్యేదని.. ప్రస్తుతం రాష్ట్రం 4వేల మెగావాట్ల సోలార్ విద్యుత్తు ఉత్పత్తి సామర్థ్యం కలిగి ఉందన్నారు. సోలార్ విద్యుత్ ఉత్పత్తిలో మన తెలంగాణ దేశంలో రెండో స్థానంలో ఉందని సగర్వంగా తెలుపుతున్నానన్నారు.
తెలంగాణ ఆవిర్భావం తొలినాళ్లలో రాష్ట్ర తలసరి విద్యుత్ వినియోగం 1,356 యూనిట్లుగా ఉండేదని, ప్రస్తుతం 2012 యూనిట్లకు పెరిగిందన్నారు. జాతీయ తలసరి విద్యుత్ వినియోగంతో పోలిస్తే మన రాష్ట్ర తలసరి విద్యుత్ వినియోగం 73 శాతం అధికంగా ఉందని చెప్పారు. తలసరి విద్యుత్ వినియోగంలో దేశంలోని పెద్ద రాష్ట్రాల్లో తెలంగాణ మొట్ట మొదటి స్థానంలో నిలిచిందని తెలిపారు. నల్లగొండ జిల్లాలో, 4000 మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యంతో నిర్మాణ మౌతున్న యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ ప్రభుత్వ రంగంలో నిర్మిస్తున్న మొట్టమొదటి అతిపెద్ద అల్ట్రా మెగా థర్మల్ పవర్ ప్లాంట్ అన్నారు. అది అందుబాటులోకి రాగానే తెలంగాణ మిగులు విద్యుత్తు కలిగిన రాష్ట్రంగా అవతరిస్తుందని చెప్పేందుకు సంతోషంగా ఉందన్నారు.
మిషన్ భగీరథ పథకంతో ఇంటింటికీ నల్లాల ద్వారా స్వచ్ఛమైన తాగునీరు అందిస్తున్న ఒకే ఒక రాష్ట్రం మన తెలంగాణ అని.. ఇలా చెప్పుకుంటూ పోతే అనేక రంగాల్లో అనేక విషయాల్లో మన రాష్ట్రం దేశంలోని ఇతర రాష్ట్రాల కంటే మిన్నగా నిలిచిందన్నారు. వివిధ రాష్ట్రాల వారు మన విధానాలను అనుసరించి, ఆచరించడానికి రాష్ట్రానికి వస్తున్నారన్నారు. మన పథకాలను, మన కార్యక్రమాలను అధ్యయనం చేస్తున్నారని.. అనతికాలంలోనే నూతన రాష్ట్రం దేశం లోని ఇతర రాష్ట్రాలకు ఆదర్శ రాష్ట్రంగా మారిన అద్భుతాన్ని టీఆర్ఎస్ ప్రభుత్వం ఆవిష్కరించిందన్నారు.