రేణు దేశాయ్ తిరిగి నటించాలని.. ఆమె మళ్ళీ స్క్రీన్ మీద కనిపిస్తే బాగుంటుందని చాలా రోజులుగా అభిమానులు కోరుకుంటున్నారు. మిలీనియం మొదట్లో పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన బద్రి, జానీ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు రేణు దేశాయ్. ఆ తర్వాత పవన్ తో సహజీవనం, పెళ్లి కారణంగా సినిమాలకు దూరమయ్యారు. ఇద్దరు పిల్లలకు తల్లి కావడంతో వాళ్ల బాధ్యత చూసుకుంటూ ఇన్ని సంవత్సరాలు కెమెరాకు దూరంగా ఉన్నారు రేణు దేశాయ్. అయితే మధ్యలో ఎన్నో సార్లు ఈమెకు సినిమాల్లో నటించే అవకాశం వచ్చినా కూడా వదిలేసుకున్నారు. కొన్ని సంవత్సరాలు పవన్ కళ్యాణ్ కోసం.. మరికొన్ని ఇల్లు, పిల్లల కోసం తన కెరీర్ త్యాగం చేశారు రేణు.
ఇప్పుడు అన్ని బాధ్యతలు పూర్తి కావడంతో మళ్ళీ రీ ఎంట్రీకి రెడీ అవుతున్నారు. పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు.. ఇప్పుడు వాళ్లను చూసుకోవడానికి ప్రత్యేకంగా ఒక మనిషి ఉండాల్సిన అవసరం లేదు.. అందుకే నటించడానికి వస్తున్నాను అంటూ ఇదివరకే చెప్పారు రేణు దేశాయ్. అయితే ఈమె నటించడం కొంతమందికి ఇష్టం లేదని.. అందుకే అవకాశాలు రాకుండా చేశారు అనే ప్రచారం కూడా సోషల్ మీడియాలో జరుగుతుంది. ఆ మధ్య ఒక పెద్ద సినిమాలో అవకాశం వచ్చినప్పుడు.. రేణు నటించడం మాకు ఇష్టం లేదు అంటూ సోషల్ మీడియాలో కొందరు కామెంట్ చేశారు.
నిజానికి బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా స్టువర్టుపురం దొంగ అనే సినిమాతోనే ఈమె రీ ఎంట్రీ ఇవ్వాలి. అయితే అదే సినిమాను ఇప్పుడు రవితేజ హీరోగా టైగర్ నాగేశ్వరరావు పేరుతో చేస్తున్నారు. ఇందులో అతి ముఖ్యమైన హేమలత లవణం అనే పాత్రలో రేణు దేశాయ్ నటిస్తున్నారు.
18 సంవత్సరాల తర్వాత ఈమె నటిస్తున్న సినిమా కావడంతో అభిమానులు ఆసక్తి కూడా బాగానే ఉంది. అయితే ఇక్కడే అందరికీ ఒక ప్రశ్న ఉత్పన్నమవుతుంది. ఇకపై కూడా రేణు నటిస్తారా.. లేదంటే కేవలం ఈ ఒక్క సినిమా వరకు మాత్రమే ఆమె పరిమితం అవుతారా అనేది ఆసక్తి కరంగా మారింది. ఎందుకంటే ఈ 18 సంవత్సరాల్లో ఎన్నోసార్లు ఎంతో మంది దర్శకులు రేణు కోసం క్యారెక్టర్స్ రాశారు కానీ.. ఆమె మాత్రం సున్నితంగా తిరస్కరించారు. ఇన్ని సంవత్సరాల తర్వాత రవితేజ సినిమాలో నటిస్తుండడంతో దర్శకులు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఒక్కటి మాత్రం నిజం.. రేణు దేశాయ్ మళ్ళీ నటన కంటిన్యూ చేస్తే మాత్రం తెలుగు ఇండస్ట్రీకి ఒక మంచి క్యారెక్టర్ దొరికినట్లే.
ఇవి కూడా చదవండి..