శ్రీశైలం : పౌర్ణమి సందర్భంగా శ్రీశైల క్షేత్రంలో భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈవో లవన్న ఆధ్వర్యంలో అర్చక వేదపండితులచే శాస్త్రోక్తంగా అభిషేకార్చనలు జరిపించారు. గురువారం ఉదయం ప్రధానాలయంలో కొలువైన దత్తాత్రేయునికి షోడశోపచార క్రతువులు నిర్వహించారు. సాయంకాలం పౌర్ణమి సందర్భంగా ప్రదోషకాలంలో అమ్మవారికి లక్షకుంకుమార్చన, ఊయలసేవ, పల్లకీ సేవలను ఘనంగా జరిపించారు.
అదే విధంగా ఆలయ ప్రధాన గోపురం నుంచి నందిమండపం మీదుగా బయలు వీరభద్రస్వామిని దర్శించుకుంటూ శ్రీశైల గిరిప్రదక్షిణ చేశారు. స్వామిఅమ్మవార్ల ఉత్సవ విగ్రహాలతో అధిక సంఖ్యలో భక్తులు శివనామస్మరణ భజనలు చేస్తూ గిరిప్రదక్షిణలో పాల్గొన్నారు.
భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి దర్శనం కోసం విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి శ్రీశైలం చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు స్థానిక ఎమ్మెల్యే చక్రపాణిరెడ్డి, ఈవో లవన్న, ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో ఘనస్వాగతం పలికారు. పీఠాధిపతి శుక్రవారం ఉదయం ఆరు గంటలకు దర్శించుకొని, ప్రత్యేక పూజలు చేయనున్నారు.