లిస్బన్: ప్రసూతి సేవల్ని నిలిపివేయడం వల్ల .. పోర్చుగల్లో అన్యాయంగా ఓ భారతీయ గర్భిణి ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన పట్ల ఆ దేశంలో తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో ఆ దేశ ఆరోగ్యశాఖ మంత్రి మార్టా టెమిడో తన పదవికి రాజీనామా చేశారు. ప్రధాని తన రాజీనామా లేఖను స్వీకరించారని, ఇక తాను ఆ పదవిలో కొనసాగేందుకు అర్హురాలిని కాను అని ఆమె అన్నారు. రాజధాని లిస్బన్లో ఓ ప్రెగ్నెంట్ మహిళ మృతిచెందిన అయిదు గంటల వ్యవధిలోనే మంత్రి మార్టా తన పదవికి రాజీనామా చేశారు.
శనివారం రోజున హాస్పిటల్ డీ సాంటా మారియా నుంచి ఓ గర్భిణిని హాస్పిటల్ సావో ఫ్రాన్సిస్కో గ్జేవియర్కు మార్చారు. నియోనాటల్ సర్వీసులో ఖాళీలు లేకపోవడంతో ఆ మహిళను మరో ఆస్పత్రికి తరలించారు. అయితే ఆ సమయంలో ఆ గర్భిణికి గుండెపోటు వచ్చింది. ఇక గ్జేవియర్ హాస్పిటల్లో ఆమెకు అర్జెంట్గా సిజేరియన్ చేశారు.722 గ్రాముల శిశువుకు ఆమె జన్మనిచ్చింది. కానీ శ్వాస సమస్య తెలెత్తడంతో తల్లిని ఇంటెన్సివ్ కేర్లోనే ఉంచారు. చికిత్స పొందుతూ ఆ గర్భిణి ప్రాణాలు విడిచింది. ఈ ఘటనకు బాధ్యత వహిస్తూ ఆరోగ్యశాఖ మంత్రి టెమిడో తన పదవికి రాజీనామా చేశారు.