‘దర్శకత్వ విభాగంలో మహిళలు చాలా తక్కువగా ఉంటారు. అద్భుతమైన ప్రేమకథాంశంతో లక్ష్మీసౌజన్య ఈ చిత్రాన్ని రూపొందించింది. ఈ సినిమా చూసి మీ బాధల్ని మరచిపోండి. సితార ఎంటర్టైన్మెంట్స్ను నా ఫ్యామిలీ బ్యానర్లా భావిస్తా. కథానాయికను ముఖ్య అతిథిగా ఆహ్వానించడం చాలా అరుదుగా జరుగుతుంటుంది. ఈ వేడుకకు నన్ను అతిథిగా పిలవడం చాలా ఆనందంగా ఉంది’ అని చెప్పింది అగ్ర కథానాయిక పూజాహెగ్డే. శనివారం జరిగిన ‘వరుడు కావలెను’ చిత్ర సంగీత్ కార్యక్రమానికి ఆమె ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. నాగశౌర్య, రీతూవర్మ జంటగా నటించిన ఈ చిత్రం ద్వారా లక్ష్మీసౌజన్య దర్శకురాలిగా పరిచయమవుతున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మించారు. ఈ నెల 29న ప్రేక్షకులముందుకురానుంది. నాగశౌర్య మాట్లాడుతూ “మన కుటుంబం మంచిది’ అని ఎంత గర్వంగా చెప్పుకుంటామో ఈ సినిమా గురించి అలాగే చెప్పుకుంటాం. సినిమా బాగుందని తెలిసి ఎన్నో ఓటీటీ ఆఫర్లొచ్చాయి. అయినా థియేటర్ రిలీజ్ కోసమే ఎదురుచూశాం. దర్శకురాలు లక్ష్మీసౌజన్య ఈ సినిమా కోసం చాలా కష్టపడింది. ఆమె శ్రమకు తగిన ప్రతిఫలం తప్పకుండా దక్కుతుంది’ అన్నారు. ‘చక్కటి కుటుంబ అనుబంధాలు, కథాబలం ఉన్న చిత్రాలకే మా సంస్థ ప్రాధాన్యతనిస్తుంది. ఫ్యామిలీ ఆడియెన్స్తో పాటు యువతను ఆకట్టుకునే చిత్రమిది’ అని నిర్మాత నాగవంశీ తెలిపారు. రీతూవర్మ మాట్లాడుతూ ‘ఈ కథ నాకు లభించడం అదృష్టంగా భావిస్తున్నా. ప్రేమ, కుటుంబ బంధాల నేపథ్యంలో అందంగా సాగే కథ ఇది’ అని చెప్పింది. కథానుగుణంగా అద్భుతమైన పాటలు కుదిరాయని సంగీత దర్శకుడు విశాల్చంద్రశేఖర్ చెప్పారు.