విక్రమ్, కార్తి, జయం రవి, ఐశ్వర్యరాయ్, త్రిష ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చారిత్రక చిత్రం ‘పొన్నియన్ సెల్వన్’. మణిరత్నం దర్శకుడు. పాన్ ఇండియా స్థాయిలో లైకా ప్రొడక్షన్స్, మద్రాస్ టాకీస్ సంస్థలు నిర్మించాయి. రెండు భాగాలుగా తెరకెక్కించారు. తొలిభాగం సెప్టెంబర్ 30న విడుదలకానుంది. ఈ చిత్రాన్ని అగ్ర నిర్మాత దిల్రాజు తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. ఈ సినిమాలోని ‘చోళ చోళ’ అనే పాటను శుక్రవారం హైదరాబాద్లో ఆవిష్కరించారు. ఏ.ఆర్.రెహమాన్ స్వరకర్త. ఈ సందర్భంగా మణిరత్నం మాట్లాడుతూ ‘ఈ సినిమా విషయంలో ముందుగా రాజమౌళిగారికి థాంక్స్ చెప్పాలి. ఎందుకంటే ఇలాంటి భారీ చిత్రాలు తీయడానికి ఆయనే మాకు మార్గం చూపారు. రెండు భాగాలుగా సినిమా తీసి మెప్పించవొచ్చని ‘బాహుబలి’తో నిరూపించారు. ఈ చిత్రాన్ని తెలుగులో విడుదల చేస్తున్న దిల్రాజుగారికి కృతజ్ఞతలు’ అన్నారు. విక్రమ్ మాట్లాడుతూ ‘నాకు మణిసార్తో ప్రత్యేకమైన అనుబంధం ఉంది.
‘రావణ్’ తర్వాత ఆయనతో చేస్తున్న చిత్రమిది. ఈ సినిమాలో నటించడంతో ఓ అద్భుతమైన కల నిజమైందనే భావన కలిగింది’ అని చెప్పారు. కార్తి మాట్లాడుతూ ‘ 1955లో ‘పొన్నియన్ సెల్వన్’ నవల పబ్లిష్ అయింది. ఎంతోమంది ఆ నవలను సినిమా తీయాలనుకున్నారు. అరవై ఏళ్ల తర్వాత ఈ కల సాకారమైంది. ఈ నవలలో ఐదు ప్రధాన పాత్రలుంటాయి. అడ్వెంచరస్ జర్నీగా, విజువల్ వండర్గా ఈ సినిమా ఆకట్టుకుంటుంది. వెయ్యేళ్ల క్రితం జరిగిన ఓ చారిత్రక కథను కళ్లకుకట్టినట్లుగా ఆవిష్కరిస్తుంది’ అన్నారు. తనికెళ్ల భరణి మాట్లాడుతూ ‘ఇరవై ఐదేళ్ల తర్వాత మళ్లీ ఈ సినిమా కోసం మాటలు రాశాను. అందుకు కారణం మణిరత్నంగారే. ఒకప్పుడు ‘దళపతి’ సినిమాలో చిన్న పాత్ర చేసే అవకాశం మిస్సయింది.
ఈ రోజు అదే మణిరత్నం సినిమాకు మాటలు రాయడం అదృష్టంగా భావిస్తున్నా’ అన్నారు. ప్రకాష్రాజ్ మాట్లాడుతూ ‘దాదాపు అరవై సంవత్సరాలుగా తమిళ జనబాహుళ్యంలో విస్త్రతంగా ప్రచారంలో ఉన్న కథ ఇది. మణిరత్నంగారు దశాబ్దకాలంగా ఈ సినిమాను దృశ్యమానం చేయాలని తపిస్తున్నారు. ఇండియాలోని ప్రతిభావంతులైన నటులు ఈ సినిమాలో భాగమయ్యారు’ అని తెలిపారు. దిల్రాజు మాట్లాడుతూ ‘ ప్రస్తుతం మంచి కంటెంట్తో సినిమాలు చేస్తే భాషాభేదాలకు అతీతంగా ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. తెలుగు ప్రేక్షకులకు కూడా చోళ రాజుల కథ గురించి తెలుసు కాబట్టి ఈ సినిమా తప్పకుండా విజయం సాధిస్తుందని నమ్ముతున్నా’ అన్నారు.