విక్రమ్, కార్తి, జయం రవి, ఐశ్వర్యరాయ్, త్రిష ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చారిత్రక చిత్రం ‘పొన్నియన్ సెల్వన్’. మణిరత్నం దర్శకుడు. లైకా ప్రొడక్షన్స్, మద్రాస్ టాకీస్ సంస్థలు నిర్మించాయి. రెండు భాగాల ఈ చిత్రం తొలి పార్ట్ పాన్ ఇండియా స్థాయిలో ఈ నెల 30న విడుదలకానుంది. తాజాగా చిత్ర ట్రైలర్ విడుదల కార్యక్రమం చెన్నైలో జరిగింది. ఈ కార్యక్రమంలో రజినీకాంత్, కమల్ హాసన్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా రజినీకాంత్ మాట్లాడుతూ…‘ఈ కథలో వంతియాతివన్ పాత్రకు నేను బాగా సరిపోతానని అప్పట్లో జయలలిత చెప్పారు. ఆమె మాటలతో నేను పొన్నియన్ సెల్వన్ పుస్తకం చదివాను. ఇందులోని నందినీ పాత్రే నా నరసింహా చిత్రంలో నీలాంబరి పాత్రకు స్ఫూర్తి. నేనూ, కమల్ హాసన్, శ్రీదేవి, విజయ్ కాంత్లు ప్రధాన పాత్రలుగా ఈ సినిమా తెరకెక్కితే బాగుండేదని గతంలో అనుకున్నాను. ఎలాగైనా ఈ సినిమాలో నటించాలని అనుకున్నా. చిన్న పాత్రైనా ఇవ్వమని మణిరత్నంను అడిగా. నీ అభిమానులతో నన్ను తిట్టించాలని అనుకుంటున్నావా అని ఆయన అన్నారు. మిగతా ఎవరైనా నేను నటిస్తానంటే సినిమా వ్యాపార దృష్ట్యా ఒప్పుకునేవారు మణిరత్నం ఒక్కరే కాదన్నారు’ అని చెప్పారు.